దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత

ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది.

Updated : 04 Jul 2024 16:26 IST

దేహ్రాదూన్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను (Uttarakhand) వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్‌ (Champawat), అల్మోరా (Almora), పిథోర్‌గఢ్‌ (Pithoragarh), ఉధమ్‌సింగ్‌ నగర్‌తోపాటు కుమాన్‌ తదితర ప్రాంతాల్లో మరో వారంరోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.  దేహ్రాదూన్‌ (Dehradun), తేహ్రి (Tehri), హరిద్వార్‌ (Haridwar) తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా (Ganga), అలకనంద (Alaknanda), భాగీరథీ (Bhagirathi), శారద (Sarada), మందాకిని (Mandakini), కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు. 

నీట మునిగిన శివుడి విగ్రహం

గత 24 గంటల్లో అల్మోరాలోని చౌకుతియా ప్రాంతంలో 72.5 మి.మీ వర్షపాతం నమోదైంది. లోహఘట్‌లో 59 మి.మీ, చంపావత్‌లో 45 మి.మీ, కాశీపుర్‌లో 42 మి.మీ, హల్‌ద్వానీలో 31 మి.మీ వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్‌ వద్ద నది ఒడ్డున ఏర్పాటుచేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. ఈనేపథ్యంలో అక్కడి వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నిలిచిన రాకపోకలు

నైనీతాల్‌, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి విపత్తు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జిల్లా మెజిస్ట్రేట్స్ ఆదేశించారు. గంగా, సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తుండగా.. అలకనంద, మందాకిని, భాగీరథీ నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి. మరోవైవు గోమతి, కాళీ, గౌరీ, శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌, యమునోత్రి, ధర్చులా, తవాఘాట్ జాతీయ రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని