New Criminal Laws: ‘90% కాపీ పేస్ట్‌.. ఎంపీలను సస్పెండ్‌ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు

New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి.

Updated : 01 Jul 2024 13:35 IST

దిల్లీ: గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (BNN), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (BSA) చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. ఫలితంగా భారత న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికార పక్షం చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం కొత్త చట్టాలను బలవంతంగా అమల్లోకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి.

146 మందిని సస్పెండ్‌ చేసి..

‘‘ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, భాజపా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. అయితే నేటినుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం. కానీ, భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్‌ న్యాయం’ ఆధిపత్యాన్ని ‘ఇండియా’ కూటమి ఆమోదించబోదు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గత శీతాకాల సమావేశాలనుద్దేశించి ఖర్గే పైవ్యాఖ్యలు చేశారు. రెండు సభల్లో చాలామంది విపక్ష ఎంపీలను అప్పట్లో సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో భద్రతా వైఫల్యానికి సంబంధించి విపక్షాలు చేపట్టిన నిరసనల మధ్య అప్పటి సస్పెన్షన్‌లు కొనసాగాయి. ఆ సమయంలోనే కొత్త న్యాయచట్టాలు పార్లమెంటు ఆమోదం పొందాయి.

న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం

సవరణలు చేస్తే సరిపోయేది..

మరోవైపు కొత్త న్యాయచట్టాల్లో 90-99 శాతం పాత వాటినుంచి కాపీ కొట్టారని సీనియర్ కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో మెరుగులుదిద్దినప్పటికీ.. వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందన్నారు. అయితే, కొన్ని మార్పులు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని విషయాల్లో స్థాయి సంఘాలు సైతం తమ అభ్యంతరాలు తెలియజేశాయని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు, బార్‌ అసోసియేషన్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పలు వేదికలపై కొత్త చట్టాల్లోని లోపాలను ఎత్తి చూపినట్లు చెప్పారు. వీటిని రాజ్యాంగబద్ధంగా అమలుచేసేందుకు దీర్ఘకాలంలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి రావొచ్చని తెలిపారు.

క్రూరమైన చట్టాలు..

కొత్త చట్టాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ రాజ్యాంగ విరుద్ధమైన, క్రూరమైనవిగా అభివర్ణించారు. ఇండియా కూటమి నుంచి కొంతమంది వీటిపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు డిమాండ్‌ చేశామన్నారు. చట్టాలపై తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ సవివరమైన లేఖను కూడా అందించినట్లు వెల్లడించారు.

మరోవైపు వీటిని తేవడంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ, బ్రిటిష్‌ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారన్నారు. దీంతో ఇక వలసపాలన నాటి నేర న్యాయచట్టాలు శాశ్వతంగా కనుమరుగుకానున్నాయని తెలిపారు. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమేనని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని