ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్‌, ప్లే గ్రౌండ్‌.. ఎక్కడో తెలుసా?

ఒడిశా అటవీ శాఖ ఏనుగుల కోసం వాటి శిక్షణా కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించింది. రెస్టారంట్‌, బాతింగ్‌ ఏరియాతో పాటు అనేక సదుపాయాలు సమకూర్చింది.

Published : 04 Jul 2024 00:04 IST

భువనేశ్వర్‌: జంతు సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాలైతే వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. తాజాగా ఒడిశా (Odisha) అటవీ శాఖ ఏనుగుల కోసం శిక్షణా కేంద్రంలో ప్రత్యేక వంటగదిని ఏర్పాటు చేసింది. అంతే కాదు వాటికోసం సకల సౌకర్యాలతో ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది.

కుమార్‌కుంటిలోని కుమ్కీ ఏనుగుల శిక్షణా కేంద్రంలో గజరాజుల కోసం రెస్టారంట్‌, నైట్‌ షెల్టర్‌, స్నానం చేయడానికి ప్రత్యేక ప్రదేశం, ఆడుకోవడానికి మైదానం వంటి సదుపాయాల్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా కేంద్రంలో ప్రస్తుతం మామ, చందు, ఉమ, కార్తీక్‌, మాస్టర్‌ జగ, శంకర్‌ అనే ఆరు ఏనుగులు ఉన్నాయి. వీటిని ఒడిశాలోని సిమిలిపాల్‌, కపిలాస్‌తో సహా వివిధ అటవీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్లు డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ తెలిపారు. గజరాజులు-మానవుల మధ్య ఏర్పడుతోన్న సంఘర్షణను (human-elephant conflicts) తగ్గించడంలో సహాయపడేందుకు వీలుగా వీటికి శిక్షణ ఇస్తున్నారు. 13 మంది మావటి, సహాయకుల పర్యవేక్షణలో వీటిని ట్రైన్‌ చేస్తున్నారు.

132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్‌ ప్రాజెక్టుపై నితిన్‌ గడ్కరీ!

మార్నింగ్‌ వాక్‌, తేలికపాటి వ్యాయామాలతో వీటి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 8:30గంటలకు అల్పాహారంగా అరటిపండ్లు, కొబ్బరికాయలు, క్యారెట్లు, చెరకు, పుచ్చకాయలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనం వరకు వీటికి ప్రత్యేక యాక్టివిటీలు ఉంటాయి. ముందుగా కుమారకుంతి డ్యాం దగ్గర గంటసేపు స్నానం చేస్తాయి. ఆరు కిలోల గోధుమలు, ఐదు కిలోల బియ్యం, ఒక కిలో పచ్చిమిర్చి, ఉలవలు, వివిధ రకాల మినుములు, రెండు నుంచి మూడు కిలోల కూరగాయలు, నాలుగు కొబ్బరికాయలు, అరటిపండ్లు, 500 గ్రాముల బెల్లంతో గజరాజులకు భోజనం తయారు చేస్తారు. వీటన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటగదిలోనే తయారుచేస్తారు. ఇక మధ్యాహ్నం నుంచి అవి ఫుట్‌బాట్‌ ఆడుతూ, వివిధ నైపుణ్యాలను నేర్చుకుంటాయి. రాత్రి షెల్టర్‌కు తీసుకెళ్తారు. వాటికి తినడానికి గడ్డి, చెట్ల కొమ్మలు, అరటి కాండం, గడ్డి ఉంటాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని