Stampede: మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం

భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 03 Jul 2024 09:30 IST

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో తీవ్ర విషాదం 
ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట
వందల మందికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దారుణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా సికంద్రరావ్‌ ఆసుపత్రి వద్ద మృతదేహాలు.. విలపిస్తున్న బంధువులు

హాథ్రస్‌: భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 121 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఒకరిపై ఒకరు పడి..

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను, క్షతగాత్రులను అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో హాథ్రస్‌లోని సికంద్రరావ్‌ ట్రామా కేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కులో ఐదారు మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది. 

ఇంటికి వెళ్లే సమయంలో..

సత్సంగ్‌ను ముగించుకుని సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు.  భక్తుల భారీ రద్దీవల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని సికంద్రరావ్‌ ఠాణా అధికారి ఆశిష్‌ తెలిపారు.  సత్సంగ్‌ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. 

గంటన్నరలోనే అంతా ముగిసింది

  • భోలే బాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమంలో గడిపారు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్‌లో పాల్గొన్న సోను కుమార్‌ తెలిపారు.
  • మైదానాన్ని మించి జనం వచ్చారని, ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. 

పార్లమెంటులో నివాళి

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. 

  • హృదయం ద్రవించే ఘటన ఇదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. హాథ్రస్‌ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. 
  • మృతులకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు.
  • ‘తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ప్రైవేటు కార్యక్రమం కావడంతో సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి ఇచ్చారు. వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు. వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భక్తులను నియంత్రించడం వారివల్ల కాలేదు. 


నేలపైనే మృత దేహాలు

తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృత దేహాలు హాథ్రస్‌లోని సికంద్రరావ్‌ ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయినవారూ మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడినవారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వారి చుట్టూ బంధువులు ఉన్నారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. కనీసం ఆక్సిజన్‌ కూడా లేదు.


ఎవరీ భోలే బాబా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. అలియాస్‌ సాకార్‌ విశ్వ హరి.. ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా బహదూర్‌ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోనూ పని చేసినట్లు చెప్పుకొనేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మికబాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.  ‘భోలే బాబా’కు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులున్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా ఫుల్‌రయీ గ్రామంలో సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని