NEET Row: నీట్‌ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్‌

నీట్‌ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Updated : 05 Jul 2024 19:19 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ - యూజీ (NEET) పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. నీట్‌ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఈ చర్య నిజాయతీ కలిగిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.  నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. నీట్‌ అక్రమాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం.. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపింది. అలాంటప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే ఫలితాలు విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సహేతుకం కాదని అఫిడవిట్‌లో పేర్కొంది. నీట్‌ను రద్దు చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది.

నీట్‌-పీజీ పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. రెండు షిఫ్టుల్లో నిర్వహణ

దేశంలోని వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న విచారించనుంది. పలు కోచింగ్ సెంటర్లు, నీట్‌ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సమాధానం కోరుతూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరోవైపు, నీట్‌ పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ గురువారం 56 మంది నీట్‌ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జులై 8న సీజేఐ ధర్మాసనం విచారణ జరపనుంది.

అవన్నీ నిరాధార ఆరోపణలే.. ఎన్‌టీఏ

మరోవైపు, ఇదే అంశంపై ఎన్‌టీఏ (NTA) కూడా సుప్రీంకోర్టుకు పలు అంశాలతో అఫిడవిట్‌ దాఖలు చేసింది. నీట్ పరీక్ష రద్దు చేస్తే లక్షలాది విద్యార్థుల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని తెలిపింది. పేపర్ లీక్ ఘటనలు మొత్తం పరీక్ష నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది.  ఈ పరీక్ష చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కాకుండా న్యాయబద్ధంగా, గోప్యతతో నిర్వహించామని, ఇందులో అవకతవకలు జరిగినట్లు దాఖలైన పిటిషనన్లు పూర్తిగా నిరాధారమైనవని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్లు ప్రజల్ని తప్పుదారి పట్టించేవిగా పేర్కొన్న ఎన్‌టీఏ.. వీటికి ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని