NEET-UG Exam: ‘పరీక్షకున్న పవిత్రత దెబ్బతింది.. సమాధానాలు కావాలి’: సుప్రీంకోర్టు

NEET-UG 2024 Exam: నీట్‌ యూజీ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది.

Updated : 11 Jun 2024 22:15 IST

దిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ - 2024 పరీక్షలో (NEET-UG 2024 Exam) అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్‌టీఏను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాలతో పరీక్షపై ఉన్న పవిత్ర భావం దెబ్బతిందని, దీనికి సమాధానాలు కావాలని తెలిపిన ధర్మాసనం.. స్పందన కోరుతూ ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విచారిస్తారని పేర్కొంది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

మైనర్‌తో శారీరక సంబంధం అత్యాచారమే.. బాలిక సమ్మతితో జరిగినా అది నేరమే

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష  జరిగిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించారు. అయితే తొలుత జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి.. అంతకంటే ముందే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాల్లో (NEET Result) 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

ఈ పరీక్షలో పేపర్‌ లీకేజీ (Paper Leak) జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు (Malpractice) చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని