New criminal laws: కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్‌ షా (Amit Shah) తెలిపారు. 

Published : 01 Jul 2024 15:09 IST

New criminal laws | దిల్లీ: కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) పునరుద్ఘాటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి వచ్చిన తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాటిపై విపక్ష నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

స్వాతంత్య్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయవ్యవస్థ లభించిందని అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. అందులోని నిబంధనలతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రిటిష్‌కాలం నాటి పలు సెక్షన్ల స్థానంలో కొత్త వాటిని తీసుకువచ్చామని తెలిపారు. మహిళలపై హింసకు సంబంధించిన నేరాలపై మాట్లాడుతూ.. బాధితురాలి ఇంటివద్దే ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు కొత్త చట్టాలు అనుమతిస్తాయని, ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకునే వీలు ఉందని గుర్తుచేశారు. ‘‘మూకదాడులకు సంబంధించి ఇంతకాలం ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. వీటిలో దానిని నిర్వచించాం. రాజద్రోహం అనే పదాన్ని తొలగించాం. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలు శిక్షార్హమైనవి’’ అని వెల్లడించారు.

కొత్త చట్టాల కింద అర్ధరాత్రి 12.10 గంటలకు గ్వాలియర్‌లో తొలి కేసు నమోదైందని, అది ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించినది హోం మంత్రి తెలిపారు. దీనికి ముందు దిల్లీలో వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజాగా దానిపై మంత్రి స్పష్టత ఇచ్చారు.

New Criminal Laws: న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం

‘‘కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై లోక్‌సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. నాలుగు సంవత్సరాల చర్చ తర్వాతే వాటిని తీసుకువచ్చాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది. వాటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ కూడా రాశా’’ అని అమిత్‌ షా తెలిపారు. గతంలో పోలీసుల హక్కులకు రక్షణ ఉందని, ఇప్పుడు ఫిర్యాదు చేసిన, బాధిత వ్యక్తి హక్కులకు కూడా రక్షణ లభిస్తుందని చెప్పారు. బ్రిటిష్‌ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని మరోసారి గుర్తు చేశారు.

మన దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు