Darshan: పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్‌ భార్య లేఖ

Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్‌ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఆమె ఓ లేఖ రాశారు.

Updated : 04 Jul 2024 16:00 IST

బెంగళూరు: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు (Renukaswamy murder case)లో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌, అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ (Pavithra Gowda) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్‌ (Darshan) భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె నటుడి భార్య కాదంటూ బెంగళూరు పోలీసు కమిషనర్‌ బి.దయానందకు తాజాగా లేఖ రాశారు.

‘‘ఇటీవల మీడియా సమావేశంలో పవిత్ర.. దర్శన్‌ భార్య అంటూ మీరు తప్పుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత కర్ణాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్టయ్యారని ఆ మంత్రి చెప్పారు. ఆమె దర్శన్‌ భార్య కాదు. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను ఒక్కదాన్ని మాత్రమే. 2003లో మా పెళ్లి జరిగింది. పోలీసు రికార్డుల్లోనూ మీరు ఆమె పేరును దర్శన్‌ సతీమణిగా పేర్కొనవద్దు. అది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’’ అని విజయలక్ష్మి (Actor Darshan's Wife) తన లేఖలో అభ్యర్థించారు.

విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ దర్శన్‌ కొంతకాలంగా కన్నడ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి పదేళ్లు అంటూ ఇటీవల నటి ఓ వీడియో పోస్ట్‌ చేసింది. దీంతో వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి.. పవిత్రకు అశ్లీల సందేశాలు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ సందేశాల గురించి దర్శన్‌కు చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురై, రేణుకాస్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.

దర్శన్‌, పవిత్ర గౌడకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌, నటి పవిత్ర గౌడ సహా పలువురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్వర్వులు ఇచ్చింది. జులై 18వరకు కస్టడీని పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో దర్శన్‌, పవిత్రతో పాటు మొత్తం 17 మంది నిందితులను పోలీసులు బెంగళూరు, తుమకూరు జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా.. జులై 18వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని