Bridge Collapse: రూ.కోట్ల ఖర్చు.. ప్రారంభానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జి

నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

Published : 18 Jun 2024 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. అయితే, ఇందులో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమల్లో వైరల్‌గా మారాయి. నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందంటూ స్థానికులు మండిపడుతున్నారు.

బిహార్‌లోని అరారియా జిల్లాలోని బక్రా నదిపై ఓ వంతనెన నిర్మించారు. కుస్రా కాంతా-కిస్రీ ప్రాంతాలను కలిపే ఈ వంతెన పదరియా ఘాట్‌ సమీపంలో ఉంది. మంగళవారం ఉదయం భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. తొలుత మూడు పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఇందుకోసం దాదాపు రూ.12కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. బ్రిడ్జి పూర్తైనప్పటికీ.. ఇరువైపుల అప్రోచ్‌ రోడ్డు పనులు మిగిలి ఉండటంతో ప్రారంభించలేదని సమాచారం. అయితే, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇది కుప్పకూలిందని స్థానిక ఎమ్మెల్యే విజయ్‌ మండల్‌ ఆరోపించారు. ఇదిలాఉంటే, ఈ ఏడాది మార్చిలోనూ రాష్ట్రంలోని సుపౌల్‌ జిల్లా కోసి నదిపై నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పది మందికిపైగా గాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని