Pollution: వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్

Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్‌ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం.

Published : 04 Jul 2024 09:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుంది ఈ మహానగరంలోనేనని తెలిపింది.

భారత్‌లోని మొత్తం పది నగరాలు- అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33 వేల మరణాలు వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లేనని కుండబద్దలు కొట్టింది.

భారత్‌ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని వెల్లడించింది. సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది. 2008 నుంచి 2019 మధ్య పది నగరాల్లోని సివిల్‌ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు. నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు.

కొవిడ్‌లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు

పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్‌ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది. దిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే.. బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్లు వెల్లడించింది. పీఎం 2.5 స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిల్లోనే మరణాలు అధికమవుతున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ‘సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌’కు చెందిన సిద్ధార్థ్‌ మండల్‌ వెల్లడించారు.

ఇలా వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్‌లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ్‌ కృష్ణ తెలిపారు. భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు దీంతో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని