Kerala Blasts: టిఫిన్‌ బాక్సులో IED పేలుడు పదార్థాలు..!

ఐఈడీ (IED) కారణంగానే కన్వెన్షన్‌ సెంటర్లో భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడించారు.

Updated : 29 Oct 2023 15:41 IST

తిరువనంతపురం: కేరళలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన పేలుళ్లు (Kerala Blasts) దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐఈడీ (IED) కారణంగానే కన్వెన్షన్‌ సెంటర్లో ఈ భారీ పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడించారు.

‘కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో (Convention Centre) ఉదయం 9.40కి పేలుడు సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నాం. భారీ పేలుడు పదార్థం ఐఈడీ (IED) కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని కేరళ డీజీపీ షేక్‌ దార్వేశ్‌ సాహెబ్‌ పేర్కొన్నారు. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి ఎన్‌ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్‌ వాసవన్‌, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు.

కేరళలోని కలమస్సేరి కన్వెన్షన్‌ సెంటర్‌లో పేలుళ్లు

ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్‌లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారు.

బాంబు అమర్చింది నేనే..!

కన్వెన్షన్‌ సెంటర్లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. కలమస్సేరీలో బాంబు అమర్చింది తానేనని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఆ బాంబు పేలుళ్లకు ఇతడికి నిజంగా సంబంధం ఉందా..? అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు