UP Exam Paper Leak: ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే కాజేశారు.. యూపీ పేపర్‌ లీకేజీలో విస్తుగొలిపే వాస్తవాలు

యూపీ పేపర్‌ లీకేజీ కేసులో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే నలుగురు ఇంజినీర్లు పేపర్‌ను లీక్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Updated : 24 Jun 2024 19:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిరాశే మిగులుతోంది. వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై, పరీక్షలు రద్దవుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఓ వైపు ‘నీట్‌ యూజీ-2024’ ప్రవేశపరీక్ష (NEET UG-2024)పై గందరగోళం నెలకొన్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ ( RO/ARO Recruitment) ప్రశ్న పత్రం లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు లీక్‌ చేసినట్లు విచారణలో తేలింది. పేపర్‌ లీకవ్వలేదని తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. టాస్క్‌ఫోర్స్‌ ముమ్మర దర్యాప్తుతో నాలుగు నెలల తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి. 

రెండు చోట్ల లీకేజీ

మొత్తం రెండు చోట్ల పేపర్‌ లీకైనట్లు విచారణలో తేలింది. ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్‌ జాన్సన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందే ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు అధికారులు తేల్చారు. అర్పిత్‌ వినీత్‌, యశ్వంత్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసి కొందరు అభ్యర్థులకు చేరవేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో అర్పిత్‌తో పాటు మరో ఐదుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం ప్రింటింగ్‌ కేంద్రంలోనే లీకేజీ జరిగినట్లు గుర్తించారు. దీనికి నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు రాజీవ్‌ నారాయణ్‌ మిశ్రా, సునీల్‌ రఘువంశీ, విశాల్‌ దుబే, సుభాష్‌ ప్రకాశ్‌లను కారకులుగా తేల్చారు.

ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే..

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 950కి.మీ దూరంలోని ఓ ప్రింటింగ్‌ కేంద్రంలో ప్రశ్నపత్రాలను ముద్రించబోతున్నట్లు ప్రధాన నిందితుడు రాజీవ్‌ నారాయణ్‌కు సమాచారం అందింది. ఎలాగైనా లీక్‌ చేయాలనుకున్నాడు. దీని కోసం తన స్నేహితుడు విశాల్‌ దుబే సాయం తీసుకున్నాడు. అదే ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్న సునీల్‌ రఘువంశీ, విశాల్‌ స్నేహితులు కావడం రాజీవ్‌కు కలిసొచ్చింది. ఇద్దరూ కలిసి సునీల్‌ను ప్రలోభపెట్టారు. గతంలో విశాల్‌ దుబే, సునీల్‌ ఒకే కాలేజీలో చదువుకోవడం వల్ల అతడిని ఒప్పించడం చాలా సులువైంది. వృత్తిరీత్యా ఓ కన్సల్టేషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న విశాల్, సుభాష్‌ ప్రకాశ్‌తో కలిసి వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను చేరుస్తుండేవారు. ఈ నలుగురు పేపర్‌ను లీక్‌ చేసేందుకు పన్నాగం పన్నారు.

ఆర్‌వో/ఏఆర్‌వో ప్రశ్నపత్రం ప్రింటింగ్‌కు రాగానే సునీల్‌ మిగతా ముగ్గురికీ సమాచారం అందించాడు. కాపీలు కావాలంటే రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. క్వచన్‌ పేపర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వాటి ఫొటోలు తీసుకోరాదని షరతు విధించాడు. దీనికి  మిగతావారంతా అంగీకరించారు. సరైన అవకాశం కోసం సునీల్‌ వేచి చూశాడు. ప్రింటింగ్‌ మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఆ పేపర్‌ను చించేస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం మెషీన్‌లో సునీల్ సమస్య సృష్టించి.. పేపర్‌ను చించేసినట్లు నటించి.. అధికారుల కళ్లుగప్పి రహస్యంగా ఇంటికి తీసుకొచ్చేశాడు. మిగతా ముగ్గురికి సమాచారం అందించాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు

ఈలోగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌ ఉపాధ్యాయ, బిహార్‌కు చెందిన అమర్జీత్‌ అనే ఇద్దరు ఏజెంట్లు.. అభ్యర్థులను గుర్తించి, వారి ఉద్యోగహామీ ఇచ్చి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరి 8న.. అంటే  అంటే పరీక్షకు మూడు రోజుల ముందు ఓ హోటల్‌కు వారందర్నీ పిలిపించారు. ప్రశ్నపత్రంతో సునీల్‌ హోటల్‌కు చేరుకున్న తర్వాత సుభాష్‌ ప్రకాశ్‌ కొంత మంది సాయంతో ‘కీ’ తయారు చేయించాడు. ప్రశ్నపత్రంలోని అంకెల వరుస క్రమంలో ‘కీ’ని యథాతథంగా గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ‘కీ’ ఫొటోలను మాత్రమే అభ్యర్థులకు ఇచ్చి వారందరికీ హోటల్‌ లోనే ఆశ్రయం కల్పించారు. పరీక్ష రాసిన వారిలో సుభాష్‌ ప్రకాశ్‌ కూడా ఉన్నాడు.

డబ్బు మీద ఆశతో..

అయితే, డబ్బుమీద ఆశతో రాజీవ్‌ నారాయణ్‌ మిశ్రా.. ప్రశ్నపత్రం ఫొటోలను రవి అత్రి మరో వ్యక్తికి ఫార్వర్డ్‌ చేశాడు. అతడు మరికొందరికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని యూపీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నపత్రాన్ని కూడా రాజీవ్‌ నారాయణ్‌ మిశ్రా, రవి అత్రిలే లీక్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే వీరిద్దర్నీ అరెస్టు చేసి మేరఠ్‌ జైల్లో ఉంచారు.

రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ పరీక్షకు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 60వేల యూపీ పోలీస్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దాదాపు 47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైనట్లు రుజువు కావడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని