Heavy Rains: ఉత్తర భారతంలో భారీవర్షాలు

ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Published : 30 Jun 2024 06:16 IST

దిల్లీ, గువాహటి: ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వరుస వర్షాలతో జలమయమైన దిల్లీ నగరంలో శుక్రవారం అయిదుగురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం నమోదైన మరో ఆరు మరణాలతో రెండు రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది. తాజాగా బాదలీ ప్రాంత అండర్‌పాస్‌ వద్ద నిలిచిన నీటమునిగి ఇద్దరు బాలురు మృతిచెందగా, వోఖలా అండర్‌పాస్‌ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయి దిగ్విజయ్‌కుమార్‌ చౌధరీ (60) అనే వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ముందురోజు వసంత్‌ విహార్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికితీశారు. దిల్లీ నగరానికి ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికను జారీ చేసింది.  హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శనివారం కురిసిన భారీవర్షాలకు కాంగ్డా, కులు, సోలన్‌ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వద్ద సూఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి శనివారం మరింత దారుణంగా మారింది. 7 రాష్ట్రాల్లోని 1.33 లక్షల మంది వరదలతో సతమతం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని