NEET: అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

NEET UG row: ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్‌ నిజమేనని కొందరు విద్యార్థులు అంగీకరించారు. దీని విచారణలో వారు కీలక విషయాలను బయటపెట్టారు.

Published : 20 Jun 2024 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్‌ లీక్‌ నిజమేనని తాజాగా బయటికొచ్చింది. ముందురోజు రాత్రే నీట్‌ ప్రశ్నపత్రం (NEET Paper Leak) తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు.

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ (Bihar) ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులోభాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్‌ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఓ అభ్యర్థి జూనియర్‌ ఇంజినీర్‌కు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం.

యూజీసీ నెట్‌ రద్దు.. అవకతవకలపై సీబీఐ దర్యాప్తు

‘‘రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నాకు మామయ్య ఫోన్‌ చేశారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, ఇంటికి రమ్మని పిలిచారు. నీట్‌ పరీక్ష (మే 5) తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి నా స్నేహితులను తీసుకుని నేను మామయ్య వద్దకు వెళ్లాను. అక్కడ నాకు నీట్‌ ప్రశ్నపత్రం, ఆన్సర్‌ షీట్‌ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీపట్టాం. మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా మ్యాచ్‌ అయ్యింది’’ అని ఆ నీట్‌ అభ్యర్థి పోలీసులకు వెల్లడించాడు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. దీంతో నీట్‌ అక్రమాల (NEET UG 2024 Exam Row) వ్యవహారం మరింత తీవ్రమైంది.

హైకోర్టుల్లో విచారణపై సుప్రీం స్టే..

మరోవైపు, నీట్‌ పరీక్ష (NEET Exam)లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని