- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అగ్నిపథ్పై ఎందుకింత అలజడి?
భారత సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ అనే స్వల్పకాల సర్వీసు విధానం అగ్గిరాజేసింది. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని, భారతీయ సైనిక
దిల్లీ: భారత సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ అనే స్వల్పకాల సర్వీసు విధానం అగ్గిరాజేసింది. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని, భారతీయ సైనిక దళాలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుందని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారని చెబుతోంది. సైనిక నియామకాలపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న యువకులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘అగ్నిపథ్’కు నియమితులైనవారిలో 25 శాతం మందికే శాశ్వతంగా సైన్యంలో సేవలందించే అవకాశం ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అగ్నిపథ్’ను ఒకసారి క్షుణ్నంగా పరిశీలిస్తే..
కొత్త విధానమిదీ..
* త్రివిధ దళాల నియామక ప్రక్రియలో ‘అగ్నిపథ్’ పేరుతో ఈ నెల 14న కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద మూడు సర్వీసుల్లో నియామకాలను స్వల్పకాల, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు.
* అగ్నిపథ్ విధానంలో మొదట అభ్యర్థుల వయోపరిమితిని 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి సైనిక నియామకాలు చేపట్టకపోవడంతో కేంద్రం ఈ ఏడాది జరిగే నియామకాలకు సంబంధించి అర్హతను గరిష్ఠంగా 23 ఏళ్లకు పెంచింది.
* త్రివిధ దళాల్లో వివిధ విభాగాల సైనికులకు నిర్దేశించిన విద్యార్హతలే అగ్నిపథ్కూ వర్తిస్తాయి.
* అగ్నిపథ్ కింద నియమితులైనవారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు.
* 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
వేతనాలు..
* అగ్నివీరులకు సర్వీసు కాలంలో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. ప్రతిభావంతులకు సేవా పతకాలు లభిస్తాయి.
* వేతనం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి (పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.
* సేవా నిధి ప్యాకేజీ అమలుకోసం రెండు ఆప్షన్లు ఉంటాయి. 1.నాలుగేళ్ల తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు సైనికుల ఖాతాలో రూ.లక్ష జమచేస్తారు. మిగతా మొత్తాన్ని రుణాలు తీసుకోవడానికి వీలుగా బ్యాంక్ గ్యారంటీ కిందికి మారుస్తారు. 2. అగ్నివీరులకు వచ్చే సొమ్మును ఏకమొత్తంగా వారి ఖాతాల్లోకే జమచేస్తారు.
* అగ్నిపథ్లో చేరిన వారు ఏదైనా కారణంతో చనిపోతే రూ.48 లక్షల జీవిత బీమా కల్పిస్తారు. విధి నిర్వహణలో మరణిస్తే అదనంగా రూ.44 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు. పనిచేయని మిగిలిన కాలానికి జీతభత్యాలు, సేవానిధి మొత్తం చెల్లిస్తారు.
* ఒకవేళ ఎవరైనా అంగవైకల్యం పొందితే వైకల్య నిష్పత్తి ప్రకారం పరిహారం చెల్లిస్తారు.
నాలుగేళ్లు పూర్తయ్యాక
నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక ప్రతి ‘అగ్నిపథ్’ బ్యాచ్లోనూ 25 శాతం మందిని మెరుగైన ప్యాకేజీతో రెగ్యులర్ క్యాడర్లోకి తీసుకుంటారు. ఇందుకోసం అగ్నివీరులు స్వచ్ఛందంగా కేంద్ర డేటాబేస్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా ఎంపికైనవారు కనిష్ఠంగా మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. త్రివిధ దళాల్లోని జేసీవో, ఎన్సీవో స్థాయి సిబ్బందికి వర్తించే సర్వీసు నిబంధనలే వీరికీ వర్తిస్తాయి.
* రెగ్యులర్ సర్వీసుకు ఎంపిక కాని వారు.. పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా వెసులుబాట్లు కల్పిస్తారు. వారికి సేవానిధి ప్రయోజనాలతోపాటు అగ్నివీర్ నైపుణ్య సర్టిఫికెట్, ఉన్నత విద్యను అభ్యసించడానికి క్రెడిట్స్ లభిస్తాయి.
ప్రభుత్వ వాదన ఏమిటంటే..
* త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అగ్నిపథ్ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ బడ్జెట్ రూ.5.25 లక్షల కోట్లు. అందులో పెన్షన్ల వాటా రూ.1.19 లక్షల కోట్లు. మొత్తం మీద వార్షిక బడ్జెట్లో దాదాపు సగానికి పైగా వేతనాలు, పింఛన్లకే సరిపోతోంది. నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నిపథ్ నుంచి బయటకు వచ్చేవారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఈ రూపంలో రక్షణ శాఖకు మిగిలే నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభిస్తుంది.
* త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. మూడు దళాల్లో సైనికుల సరాసరి వయసు 32గా ఉంది. అగ్నిపథ్ వల్ల అది క్రమంగా 24-26 ఏళ్లకు తగ్గుతుంది. సైనికదళాల్లో సాంకేతిక సామర్థ్యం పెరుగుతుంది.
* 2030-32 నాటికి సైన్యంలో అగ్నివీరుల వాటా దాదాపు సగం మేర ఉండొచ్చు. తద్వారా యువత, అనుభవం మధ్య మెరుగైన సమతూకం ఉంటుంది. భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
యువత నుంచి వ్యతిరేకత ఎందుకు?
శాశ్వతంగా సైన్యంలో చేరాలనుకునే తమ కలలను నీరుగార్చే విధంగా అగ్నిపథ్ ఉందని నిరుద్యోగులు వాదిస్తున్నారు. పాత నియామక వ్యవస్థ కింద 16.5-21 ఏళ్ల మధ్య సైన్యంలో భర్తీ కావడానికి అవకాశం ఉండేది. వారు కనీసం 15 ఏళ్లు సర్వీసులో కొనసాగేవారు. ఆ తర్వాత పింఛను వచ్చేది. అగ్నిపథ్లో ఈ వెసులుబాటు లేకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
* నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకొని బయటకొచ్చాక తమ భవిష్యత్ అయోమయంలో పడిపోతుందని వాపోతున్నారు. ఆ దశలో మళ్లీ సాధారణ నిరుద్యోగుల్లా ఇతరులతో తాము పోటీ పడాలా అని ప్రశ్నిస్తున్నారు.
మాజీ సైనికాధికారుల్లోనూ ఆందోళనలు
మాజీ సైనికాధికారుల్లో కొందరు అగ్నిపథ్ను స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరి ప్రధాన అభ్యంతరాలివీ..
* త్రివిధ దళాల్లో సింహభాగాన్ని నాలుగేళ్ల పాటే కొనసాగించడం వల్ల జవాన్లలో వృత్తి నైపుణ్యం కొరవడుతుంది. సైన్యానికి అత్యంత కీలకమైన రెజిమెంట్ సంస్కృతికి విఘాతం కలుగుతుంది.
* ఎక్కువ మంది సైనికులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరు. నాలుగేళ్ల తర్వాత చేపట్టబోయే ఉద్యోగంపైనే వారి దృష్టి ఉంటుంది. అందువల్ల మూడు దళాల్లో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుంది.
* అగ్నిపథ్ అంతిమంగా సమాజ సైనికీకరణకు దారితీస్తుంది. ఇది శ్రేయస్కరం కాదు.
వెనక్కు తీసుకోవాల్సిందే కాంగ్రెస్ సహా విపక్షాల డిమాండ్
దిల్లీ: సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు నిరసన స్వరాన్ని పెంచాయి. ఆ పథకం దేశ ప్రయోజనాలకు, భద్రతకు, యువతకు ఏమాత్రం ఉపయోగపడదని హస్తం పార్టీ విమర్శలు గుప్పించింది. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీకి ‘మిత్రుల’ కోరికలు తప్ప ఇంకేమీ వినపడవని, అందుకే ఈ దేశ ప్రజల ఆకాంక్షలు ఆయనకు అర్థం కావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
సైన్యాన్ని అద్దెకు నియమించుకోలేం
- భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
17 ఏళ్లకు సైన్యంలో చేరినవారు 21 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్రభుత్వం ఎలా చెబుతుంది? సైనికులను అద్దెకు నియమించుకోలేం కదా. ఈ పథకం కింద ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కూడా పింఛను ఇవ్వరు. ఇది సైన్యాన్ని అవమానించడం, యువతను మోసగించడమే.
ఒప్పంద ఉద్యోగానికి అగ్నివీర్ పేరా..!
- హేమంత్ సొరెన్, ఝార్ఖండ్ సీఎం
అగ్నిపథ్ పథకంలో ప్రభుత్వం నాలుగేళ్ల ఒప్పందకాలానికే ఉద్యోగాలు ఇస్తుంది. కానీ వాటి పేరు మాత్రం గొప్పగా ‘అగ్నివీర్’ అని పెట్టింది. నినాదాలకు పేరుగాంచిన ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం.
పథకంపై సమీక్ష జరపాలి
- నీతీశ్ కుమార్, బిహార్ సీఎం
అగ్నిపథ్ పథకంపై కేంద్రం వెంటనే సమీక్ష జరపాలి. ఇందులోని నిబంధనలతో తమ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడబోదని యువతకు భరోసానివ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
-
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
-
టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
-
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
-
అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్పై నాగ్ అశ్విన్ పోస్ట్
-
భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్ పరేడ్.. ఎక్కడంటే?