వందేభారత్‌ రైలులో వర్షపునీటి లీకేజీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్‌ వందేభారత్‌ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.

Published : 04 Jul 2024 04:31 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్‌ వందేభారత్‌ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. టికెటు ధర ఎక్కువైనా ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని చాలామంది ఈ ప్రీమియం రైలునే ఎంచుకొంటున్నా.. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. దిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన రైలులో ఇటీవల వర్షపునీటి లీకేజీ వీడియో వైరల్‌గా మారింది. పైకప్పు నుంచి ఏకధాటిగా నీరు లోనికి చేరి సీట్లన్నీ తడిసిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోను షేర్‌ చేసిన ఓ ప్రయాణికుడు రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘వందేభారత్‌లో ఇప్పటివరకు కేటరింగ్‌ సమస్యే ఉండేది. ఇక నుంచి మరో కొత్త సమస్య’’ అని.. ‘‘ఇకపై తడుస్తూ ప్రయాణించవచ్చు. ధర ఎక్కువ.. సేవలు తక్కువ’’ అని నెటిజన్లు కామెంట్లు గుప్పించారు. ఈ ఘటనపై ఉత్తర రైల్వే స్పందించి ఓ ప్రకటనలో ప్రయాణికులను క్షమాపణలు కోరింది. ‘‘నీటిపైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతోనే ఇలా జరిగింది. ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని