నీట్‌ రీ-టెస్ట్‌ ఫలితాలు విడుదల

నీట్‌ యూజీ 2024 పరీక్షలో గ్రేస్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది.

Updated : 02 Jul 2024 05:58 IST

మారిన ర్యాంకుల జాబితా

దిల్లీ: నీట్‌ యూజీ 2024 పరీక్షలో గ్రేస్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్‌ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్ష తుది జవాబు కీని నీట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. ఈ ఫలితాల తర్వాత నీట్‌ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. సవరించిన స్కోర్‌ కార్డులను https://exams.nta.ac.in/NEET వినినిగి లో చూసుకోవచ్చు. త్వరలోనే నీట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. గ్రేస్‌ మార్కులు కలపడంతో 720 మార్కులు పొంది మొదటి ర్యాంకు సాధించిన ఆరుగురు అభ్యర్థుల్లో అయిదుగురు మళ్లీ నిర్వహించిన పరీక్షకు హాజరు కాగా తాజా ఫలితాల్లో వారిలో ఏ ఒక్కరూ 720 మార్కులు పొందలేకపోయారు. ఆరో అభ్యర్థి మాత్రం తనకు కలిపిన గ్రేస్‌ మార్కులను వదులుకుని వచ్చిన ర్యాంకుతో సరిపుచ్చుకున్నాడు. తాజా ఫలితాలతో మొదటి ర్యాంకు పొందినవారి సంఖ్య 68 నుంచి 61కి తగ్గింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని