ఎమర్జెన్సీపై ఓంబిర్లా వ్యాఖ్యలు సరికాదు

‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు.

Published : 30 Jun 2024 05:36 IST

స్పీకర్‌ స్థాయి వ్యక్తి రాజకీయ ప్రకటనలు చేయకూడదు: పవార్‌

కొల్హాపుర్‌: ‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. సభాపతి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అనడం సరికాదని పేర్కొన్నారు.  ‘‘లోక్‌సభ స్పీకర్‌ పదవిలో ఉన్న ఓం బిర్లా అసందర్భంగా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోంది. ఇందిరాగాంధీ ఇప్పుడు లేరు. అయినా ఈ అంశాన్ని స్పీకర్‌ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? స్పీకర్‌ పాత్ర.. రాజకీయ ప్రకటనలు చేయడమా..? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని శరద్‌ పవార్‌ అన్నారు. బుధవారం లోక్‌సభలో ‘అత్యయిక పరిస్థితి’ని ఖండిస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగంపై దాడి చేశారంటూ ఓ తీర్మానాన్ని స్పీకర్‌ చదివిన సంగతి తెలిసిందే.  లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీని ఎన్నుకోవడాన్ని పవార్‌ స్వాగతించారు. రాహుల్‌ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘పార్లమెంట్‌లో భాజపాకు మెజారిటీ లేదనడంలో ఏ సందేహం లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు నీతీశ్‌కుమార్, చంద్రబాబు మద్దతు లేకుంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయేవారు. దీన్ని ఎంతగా వారు దాయాలనుకున్నా.. వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. భారత ప్రజల నుంచి వారికి స్పష్టమైన మద్దతు లేదు’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు