Salman Khan: ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్‌ఖాన్‌ వాంగ్మూలం

Salman Khan: తన ఇంటిపై దుండగులు కాల్పులు జరిపిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని నటుడు సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచానని అన్నారు.

Published : 13 Jun 2024 10:21 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు (Firing outside Salman Khan house) చోటుచేసుకోవడం ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఘటనకు సంబంధించి నటుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) పోలీసులకు తెలిపారు.

కాల్పుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం జూన్‌ 4న క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం సల్మాన్‌ నివాసానికి వెళ్లినట్లు ఓ అధికారి వెల్లడించారు. నటుడితో పాటు అతడి సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నుంచి పోలీసులు (Mumbai Police) స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్నారు. సల్మాన్‌ వాంగ్మూలం తీసుకోవడానికి నాలుగు గంటలు, ఆయన సోదరుడి స్టేట్‌మెంట్‌కు 2 గంటలకుపైగా పట్టినట్లు ఆ అధికారి తెలిపారు. వీరిద్దరినీ కలిపి 150కి పైగా ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు.

‘‘ఘటన జరిగిన రోజు (ఏప్రిల్‌ 14) నేను ఇంట్లోనే ఉన్నా. ముందు రోజు రాత్రి పార్టీ వల్ల ఆలస్యం కావడంతో లేట్‌గా పడుకున్నా. తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా బయట ఎవరూ కన్పించలేదు’’ అని సల్మాన్‌ వాంగ్మూలం (Salman Khan Statement)లో వెల్లడించారు. ఇక, ఘటన జరిగిన రోజు జుహూలోని తన నివాసంలో ఉన్నట్లు నటుడి సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ పోలీసులకు తెలిపారు. అయితే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయని చెప్పారు.

ఆ ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సల్మాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి. ఇది గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకడు ఇటీవల పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని