Akhilesh Yadav: మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌ యాదవ్

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పలు అంశాలపై మాట్లాడారు. 

Updated : 02 Jul 2024 16:07 IST

దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh Yadav) పేపర్‌ లీక్‌, ఈవీఎంలు, అయోధ్య ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి గురించి మాట్లాడారు.

‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న అవినీతి గురించి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట దోపిడీ జరుగుతోందన్నారు. ఒకప్పుడు తాము నిర్మించిన రోడ్లపై విమానాలు దిగాయని, కానీ ఇప్పుడు ప్రధాన నగరంలో పడవలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదేం స్మార్ట్‌ సిటీనో అంటూ ప్రభుత్వ పథకాలపై విమర్శలు గుప్పించారు.

నీట్‌ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు 80కి80 సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. అయోధ్యలో భాజపా ఓటమి.. పరిణితి సాధించిన ఓటరు విజయమని వ్యాఖ్యానించారు. ‘‘కులగణనకు మేం అనుకూలం. అలాగే అగ్నివీర్ స్కీమ్‌ను మేం ఎప్పటికీ అంగీకరించం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దానిని రద్దు చేస్తాం. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదు. ఉద్యానవన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి’’ అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే: రాహుల్‌

లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ‘‘మోదీ ప్రపంచంలో నిజాలను చెరిపేస్తారు. కానీ వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాదు. నేను చెప్పాలనుకున్న నిజం చెప్పాను. వారు కావాలంటే అంతా తొలగించుకోని. నిజం ఎప్పటికీ నిజమే’’ అని రాహుల్ స్పష్టం చేశారు. తన ప్రసంగంలోకి కొన్ని మాటలను తొలగించడంపై స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దాని గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని