NEET Row: ‘నీట్‌’ వ్యవహారంలో కీలక పరిణామం.. సీబీఐ రంగ ప్రవేశం

NEET Row | వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ (యూజీ) పరీక్షలో అవకతవకలపై విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Published : 23 Jun 2024 15:52 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ (CBI) ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై  పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే, బిహార్‌లో పేపర్‌ లీక్‌, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా విచారించనుంది. 

నీట్‌ పరీక్షల్లో ‘మున్నాభాయ్‌’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!

కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు సీబీఐ తెలిపింది.  దేశవ్యాప్తంగా దాదాపు 24లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు జరిగాయని పలుచోట్ల కేసులు నమోదైనట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని