132 seater bus: 132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్‌ ప్రాజెక్టుపై నితిన్‌ గడ్కరీ!

వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Updated : 03 Jul 2024 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈనేపథ్యంలో వ్యక్తిగత, ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం నాగ్‌పుర్‌లో పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు.

‘‘కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతి ప్రత్యామ్నాయం, కాలుష్యరహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చాయి. వందల సంఖ్యలో ఇథనాల్‌ పంపులు ఏర్పాటుకానున్నాయి. రూ.120 లీటరు పెట్రోల్‌కు ఖర్చుపెట్టే బదులు.. రూ.60తో ఇథనాల్‌ వాడొచ్చు. డీజిల్‌ బస్సు కి.మీ. నిర్వహణకు రూ.115 ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు రూ.50 నుంచి రూ.60 అవుతుంది. దీంతో టికెట్‌ ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుంది’’ అని నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

పైలట్‌ ప్రాజెక్టు..

‘‘చెక్‌ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటం చూశాను. ఇక్కడ కూడా టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో ఓ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాం. మన ప్రాజెక్టులోనూ 132 మంది కూర్చునేవిధంగా బస్సును రూపొందిస్తున్నాం. 40 కి.మీ. దూరం వెళ్లాక ఛార్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 40 సెకన్ల పాటు ఛార్జింగ్‌ చేస్తే మరో 40 కి.మీ. వెళ్లొచ్చు. దీంతో కి.మీ. ఖర్చు రూ.35 నుంచి రూ.40 మాత్రమే అవుతుంది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

సౌకర్యాలు ఇలా..

‘‘ఈ బస్సులో విమానంలోలా సీటింగ్‌, ఏసీ, సీటు ముందు ల్యాప్‌టాప్‌ పెట్టుకొనే సౌలభ్యం ఉండాలని సూచించా. ఎయిర్‌ హోస్టెస్‌ మాదిరిగా పండ్లు, ప్యాక్‌ చేసిన ఆహారం, శీతల పానీయాలు అందించేందుకు ‘బస్‌ హోస్టెస్‌’ ఉంటారు. డీజిల్‌ బస్సుతో పోలిస్తే దీని నిర్వహణకు 30శాతం ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ సోలార్‌ పవర్‌ వినియోగిస్తే ఈ ఖర్చు మరింత తగ్గుతుంది’ అని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఇలా దేశంలో కాలుష్యరహిత రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు