KCR: కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

భారాస అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది.

Updated : 01 Jul 2024 14:00 IST

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్(ఏజీ) తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.

జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకర్ల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారు. అనుమానించడం కాదని, దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ ఛైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చినట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు