Justice Narasimha Reddy: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ

భారాస హయాంలో నిర్మించిన విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతోన్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ రాశారు.

Published : 29 Jun 2024 16:57 IST

హైదరాబాద్‌: భారాస హయాంలో నిర్మించిన విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతోన్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న విద్యుత్‌ అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. 2003 కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం ప్రకారం పీజీసీఐఎల్‌ నిబంధనలకు లోబడే ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడిందేగానీ, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. 

భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మాణం విషయంలో అప్పుడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ ముందుకురావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, పెరుగుతోన్న విద్యుత్‌ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొనే నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఒక విషయంలో విచారణ జరుపుతున్నప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన అందరినీ విచారించాలి గానీ, కొంతమంది వద్దే సమాచారం తీసుకొని మీడియా సమావేశంలో మాట్లాడటం బాధకరమన్నారు. ఇది తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను జగదీశ్‌రెడ్డి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని