Revanth Reddy: రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌

రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని స్పష్టంచేశారు.

Published : 28 Jun 2024 19:13 IST

దిల్లీ: రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాం. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడని అధికారులను ఆదేశాలు ఇచ్చాం. మండలాలు రెవెన్యూ డివిజన్‌ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తర్వాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తాం’’ అన్నారు.

లాభాల్లో ఆర్టీసీ..

మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 30శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సరే.. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించిన తరువాత కుల గణన చేస్తాం.

రుణభారం తగ్గించుకునే పనిలో ఉన్నాం

రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రతి నెల రూ. 7వేల కోట్ల అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ. 6,500 కోట్లు కట్టేవారు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తెచ్చారు. రుణభారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నాం. ఒక్కశాతం తగ్గినా రూ. 700 కోట్లు ఆదా అవుతాయి. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు.. కేంద్రమంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని