Chandrababu: రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: సీఎం చంద్రబాబు

రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజ సేవకు అయన ఎంతో చేశారని కొనియాడారు.

Updated : 27 Jun 2024 20:44 IST

విజయవాడ: రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘రామోజీరావు వ్యక్తికాదు. ఓ వ్యవస్థ. ఏ పనిచేసినా.. ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు. మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్‌వన్‌గా ఎదిగారు. 1974 ఆగస్టు 10న ‘ఈనాడు’ పత్రిక విశాఖలో ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా ‘ఈనాడు’ అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తోంది. రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారు. ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చారు. మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు. చరిత్రలో ఒకే ఒక ఎన్టీఆర్‌.. ఒకే ఒక రామోజీ మాత్రమే ఉంటారు.

మార్గదర్శి సంస్థను దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఏం చేసినా ఆ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు. రామోజీ ఫిల్మ్‌ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొవిడ్‌ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకుంటారు. చాలా మంది పదవులు ఉంటేనే సేవ చేస్తారు. కానీ, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన, సేవలు అందించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో అధికారంలోకి వచ్చారంటే అందులో రామోజీరావు పాత్ర కీలకం. ఎన్నికష్టాలు వచ్చినా భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో ఉంది.

అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం..

రామోజీరావు నిరంతరం విలువల కోసం బ్రతికారు.. ప్రజల కోసం పోరాటం చేశారు. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తున్న సమయంలో రీసెర్చ్‌ చేసి ‘అమరావతి’ పేరును సూచించారు. ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయత. పనిచేస్తూ చనిపోవాలని ఆయన కోరుకున్నారు. చివరి రోజుల్లో అదే జరిగింది. దిల్లీలో విజ్ఞాన్‌ భవన్‌ మాదిరిగా.. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్‌ అని పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం.  తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్‌, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి’’ అని సూచించారు. సంస్మరణ సభకు వచ్చిన అందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని