ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 01 Jul 2024 10:20 IST

అమరావతి: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు.

‘‘మీ అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది.

పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని గత పాలకులకు చెప్పా

గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదన్నారు. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పా. నేడు 1.25లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోంది. దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టా. మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశా. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టా. రూ.5 కే భోజనం చేయొచ్చు. త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తాం. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తాం. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మాది ప్రజా ప్రభుత్వం.. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలి.

మంగళగిరి రుణం తీర్చుకుంటాం

తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయి. గతంలో ప్రజల బతుకులను రివర్స్‌ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలి. అందరం సమష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతాం. మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకుంటాం.

గత ఎన్నికల్లో లోకేశ్‌ ఓడినా మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారు. మీ అందరి అభిమానం చూరగొని బరిలో నిలిచారు. మంగళగిరిలో లోకేశ్‌ను 90 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో తెదేపాను గెలిపించారు. ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ లోకేశ్‌కు వచ్చింది. కుప్పంలో 60 వేల మెజారిటీ వస్తే గొప్ప అనుకునేవాడిని. గాజువాక, భీమిలిలో మంచి ఆధిక్యంతో గెలిపించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారు. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారు’’ అని చంద్రబాబు అన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తావించారు. వాటిని పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌ సీఎంను కోరారు. అమరావతి నిర్మాణ పనులకు మంగళగిరి ప్రజలు అండగా ఉంటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు