Atluri Rammohan rao: అట్లూరి రామమోహనరావు కన్నుమూత

రామోజీ గ్రూపు సంస్థల్లో ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.

Updated : 22 Oct 2022 20:38 IST

హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. అట్లూరి రామమోహనరావు 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఆయన సహాధ్యాయి, బాల్య స్నేహితులు. ఉపాధ్యాయుడిగా రామమోహనరావు తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది.. 1995వరకు ఆ పదవిలో కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్‌ సిటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టి, సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామమోహనరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

సంతాపం ప్రకటించిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

అట్లూరి రామమోహనరావు మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఈనాడు వంటి ప్రతిష్టాత్మక సంస్థలో డైరక్టర్‌గా, ఎండీగా అట్లూరి రామమోహనరావు విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఫిల్మ్ సిటీ నిర్మాణంలో కీలకపాత్ర వహించి, ఎండీగా కూడా తన సేవలందించారని కొనియాడారు. రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అట్లూరి రామమోహనరావు పార్థివదేహం

అట్లూరి రామమోహనరావు మరణం బాధాకరం: బండి సంజయ్‌

రామోజీ గ్రూప్ సంస్థల ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు మృతి పట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అట్లూరి రామమోహనరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు