logo

ఆన్‌లైన్‌ యాప్‌లతో రూ. లక్షల్లో నష్టపోయాం

జీఎంఆర్‌ ఆన్‌లైన్‌ యాప్‌ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు.

Published : 29 Jun 2024 04:06 IST

ద్రాక్షారామ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ద్రాక్షారామ పోలీస్టేషను ఎదుట జీఎంఆర్‌ యాప్‌ బాధితులు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే : జీఎంఆర్‌ ఆన్‌లైన్‌ యాప్‌ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ద్రాక్షారామ పరిసరాలతోపాటు అంబాజీపేట, అమలాపురం, తణుకు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. తమలా సుమారు వెయ్యి మంది వరకు మోసపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తామందరికీ యాప్‌లను పరిచయం చేసిన బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్‌కుమార్, మోటుపల్లి కిరణ్‌కుమార్‌లను వారు పోలీసులకు అప్పగించారు. జీఎంఆర్‌ స్కీములో తొలుత చేరిన వ్యక్తి ఇద్దరిని చేర్చాలని, ఆ వ్యక్తి జీఎంఆర్‌ యాప్‌ లింక్‌ను మిగతా ఇద్దరికి పంపిస్తాడని చెప్పాడని బాధితుల్లో ఒకరైన కృష్ణ తెలిపారు.  అలా మొబైల్‌కు వచ్చిన లింకును తెరచి దాని ద్వారా రూ. 4,500, 15,800, 30,000, 60,000, 1,20,000 ఇలా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చని, దానిపై రోజూ ఆదాయం వస్తుందని వివరించాడు. ఉదాహరణకు రూ.15,800 పెడితే రోజుకు రూ.500 చొప్పున మన ఐడీకి జమ అవుతాయన్నారు. అలా జమ అయిన సొమ్ము రూ.5 వేలు పూర్తయ్యాక కేవలం వారానికి ఒకసారి శుక్రవారం రోజున విత్‌డ్రా చేసుకోవచ్చన్నారు. లక్షల్లో పెడితే వేలల్లో ఆదాయం వస్తుంది. ఇలా కట్టిన వారికి మొదట్లో డబ్బులు వచ్చేవని, ప్రస్తుతం బాధితులందరికీ సొమ్ము యాప్‌లో జమ అవుతుంది గాని నాలుగు వారాల నుంచి విత్‌డ్రా కావడం లేదన్నారు. దీంతో మోసపోయినట్లు తామంతా గుర్తించామన్నారు. ఇటీవలే డబ్బులు రావడానికి జీఎస్టీ చెల్లించాలంటే అది కూడా కట్టామన్నారు. అయినా యాప్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా కావడం లేదని వాపోయాడు. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు కూలంకషంగా లేదని, వారు వివరంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్సై సురేంద్ర తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని