logo

విద్యార్థులకు ఉపకారం.. విజ్ఞాన్‌ మంథన్‌

నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Updated : 01 Jul 2024 06:18 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి: నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డీఆర్డీవో, బార్క్, సీఎస్‌ఐఆర్‌ వంటి జాతీయ ప్రఖ్యాత పరిశోధన సంస్థలను సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాల ఇంటర్న్‌షిప్, ఏడాది పాటు నగదు ప్రోత్సాహకాలను అందించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.. ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి, విజ్ఞాన్‌ ప్రసార్, ఎన్‌సీఈఆర్టీ(నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌) సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌(వీవీఎమ్‌) ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్‌ కళాశాలలు 1,017 వరకు ఉండగా, ఇందులో 6 నుంచి ఇంటర్‌ వరకు 2.42 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.

దరఖాస్తులు ఎలా పంపించాలంటే..?

ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 రుసుం చెల్లించి, ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. సెప్టెంబరు 15 వరకు అవకాశం ఉంటుంది. నమోదు చేసుకున్న వారికి జూనియర్, సీనియర్‌ విభాగాల్లో ప్రకటించిన తేదీల్లో పరీక్షలు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలతో పాటు ఇతర దేశాల భాషల్లోనూ పాల్గొనవచ్చు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే వెబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబరు 23, 27(వీలును బట్టి ఏదైనా తేదీల్లో) పరీక్ష ఉంటుంది. నవంబరు 15న ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో ఒక రోజు రాష్ట్ర స్థాయి పోటీలుంటాయి. 2025 మే 17 లేదా 18 తేదీల్లో జాతీయ స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరమైనా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పరీక్ష విధానం ఇలా..

వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసిన వారికి వంద బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు చదివే సామాన్య, గణితం, పాఠ్యపుస్తకాల్లోని అంశాలు 50 శాతం, విజ్ఞానశాస్త్ర రంగంలో భారతదేశ కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలపై 20 శాతం మార్కులుంటాయి. ఇవి వీవీఎం వారు అందించే స్టడీ మెటీరియల్‌ ద్వారా ఇస్తారు. ఇక లాజిక్, రీజనింగ్‌ 10 శాతం ప్రశ్నలు వస్తాయి. వీటిని సమకాలీన అంశాలపై ఇస్తారు.

విజేతలకు ఉపకార వేతనం..

పాఠశాల స్థాయి పోటీల్లో 18 మంది చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి ఆన్‌లైన్‌ ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రం, జ్ఞాపిక, రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున అందజేస్తారు. అలాగే భాస్కర స్కాలర్‌షిప్‌ పేరుతో ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి..

బి.స్వామి, జిల్లా సైన్స్‌ అధికారి, భూపాలపల్లి

పాఠ్యపుస్తకాలతో పాటు, సామాజిక అంశాలు, చరిత్రపై పట్టున్న విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిభా పోటీలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటాయి. కంప్యూటర్, చరవాణి తెలిసిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలల హెచ్‌ఎంలకు సమాచారాన్ని అందించి, ఎక్కువ మంది పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని