logo

ఐపీసీ స్థానంలో బీఎన్‌ఎస్‌!

నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) 2023, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ) అమల్లోకి తెచ్చింది.

Published : 01 Jul 2024 02:40 IST

నూతన న్యాయ చట్టాల అమలుకు సిద్ధం
కమిషనరేట్‌లో సిబ్బందికి శిక్షణ పూర్తి 

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం : నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) 2023, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ) అమల్లోకి తెచ్చింది. నేటి నుంచి ఠాణాల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్ల ద్వారా కేసులను నమోదు చేయాలి. బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత అధికారి పరిశీలించి ఏ సెక్షన్‌ వర్తిస్తుందో తెలుసుకొని కేసులను నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి నెల పాటు కొత్త చట్టాలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు. సుమారు 2 వేల మంది వరకు సిబ్బంది తరగతులకు హాజరయ్యారు. కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసేందుకు ఠాణాల్లో అధికారులు, రైటర్లు సిద్ధమవుతున్నారు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్‌ఎస్‌లో 358కి కుదించారు. కొత్త చట్టంలో పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. దీంతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

మహిళలు, పిల్లలపై నేరాల్లో..

సమాజంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు కొత్త చట్టంలో అనేక చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న వాటికంటే శిక్షలు, కాల పరిమితిని పెంచారు. బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టంలో అంశాలను పొందుపర్చారు. రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలి. బాధిత మహిళలు, పిల్లలకు ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీనిస్తున్నాయి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. 

ఠాణాకు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చు..

బాధితుడు ఠాణాలకు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఘటనకు సంబంధించిన అంశాలను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో కేసు విచారణ వేగవంతంగా చేసేందుకు పోలీసులకు వెసులుబాటు ఉంటుంది. జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఏ వ్యక్తి అయినా, ఠాణా పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడి ఠాణాలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదైన తర్వాత బాధితుడితో పాటుగా నిందితుడు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఉచితంగా పొందే అవకాశం ఉంది. 

సాంకేతికత తోడుగా..

గతంలో కేసుల దర్యాప్తు మందకొడిగా జరిగేది. కొత్త నేర న్యాయ చట్టాల ద్వారా దర్యాప్తు వేగవంతం చేసేందుకు వెసులుబాటు ఉంది. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో సమన్ల జారీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు వేగంగా జరగనుంది.

ఫోరెన్సిక్‌ పరిశోధన తప్పనిసరి

తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు తప్పనిసరిగా వెళ్లాలి. అక్కడ లభించిన ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేస్తారు. దీంతో దర్యాప్తు నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుంది. నిందితులకు శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

కేసుల విచారణలో మార్పులు..

రాజమహేంద్రనాయక్, డీసీపీ, వెస్ట్‌జోన్‌ (జనగామ) 

నూతన నేర న్యాయ చట్టాలు- 2023 ద్వారా కేసుల విచారణ వేగవంతం అవుతుంది. కేసుల విచారణలో మార్పులు వస్తాయి. ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఇది ఒక మైలురాయి. నేరం చేసిన వారికి శిక్షలు పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. దీంతో సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంది. 

నిందితులకు శిక్షలు పడతాయి 

సీ.విద్యాసాగర్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది 

బాధితులు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయాలి. విచారణ పారదర్శకంగా జరుగుతుంది. నూతన చట్టాల అమలుతో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. నేరం చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదు. నిందితులను పోలీస్‌ కస్టడీలోకి తీసుకునే గడువు పెంచారు. ప్రస్తుతం అరెస్టయిన తర్వాత 14 రోజుల్లోపే కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ గడువును 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు, 90 రోజుల్లో దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు పొడిగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని