logo

tragedy: బాలికల విషాద ‘ప్రేమలు’

నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు చేసిన ఆత్మహత్యా ప్రయత్నంలో ఓ బాలిక మృతిచెందగా మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

Published : 01 Jul 2024 07:21 IST

వేర్వేరు ఘటనల్లో ఒకరి ఆత్మహత్య, మరొకరికి చికిత్స

నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు చేసిన ఆత్మహత్యా ప్రయత్నంలో ఓ బాలిక మృతిచెందగా మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

పెళ్లికి అంగీకరించలేదని..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ఓ బాలిక చీమలమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంవీపీ స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌ వెనుకాల ఓ నిర్మాణ భవనంలో ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె (17) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. 8వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతన్ని వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై శనివారం ఉదయం చీమలమందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. దీనిపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ. సంజీవరావు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల ఆందోళన: ఈ బాలికకు సకాలంలో వైద్యం అందలేదంటూ కేజీహెచ్‌ వద్ద బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆదివారం వైద్యులు లేక తమ కుమార్తెకు సరైన సమయంలో వైద్యం అందలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే బతికి ఉండేదని వాపోయారు.

దుకాణం నుంచి ఇంటికి వస్తూ..

గురుద్వారా, న్యూస్‌టుడే: ఎలుకల మందు తాగి బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ద్వారకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన బాలిక (17) తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఉంటోంది. బాలిక సీతంపేట సమీపంలోని ఓ మిఠాయి దుకాణంలో పని చేస్తోంది. శనివారం రాత్రి దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా గురుద్వారా సమీపంలో ఎలుకల మందు తాగడంతో స్థానికులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. ప్రాణాపాయం లేదన్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని