logo

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవరు మృతి

పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ కామరాజ్‌ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్‌ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది.

Published : 03 Jul 2024 00:33 IST

కామరాజ్‌ (పాతచిత్రం)

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ కామరాజ్‌ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్‌ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కామరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీటమునిగి పెయింటర్‌...

రెడ్‌హిల్స్‌: ఆవడి సమీప తిరునిండ్రవూరు నాగాలమ్మ ఆలయ వీధికి చెందిన విమల్‌కుమార్‌ (26) పెయింటర్‌. ఇతను తన స్నేహితులతో కలిసి బాలవేడులోని చెరువులో మంగళవారం స్నానానికి దిగాడు. లోతైన ప్రాంతంలో చిక్కుకుని మునిగిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు గాలించి విమల్‌కుమార్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా కార్మికుడు...

విల్లివాక్కం: ఈరోడ్‌ శాస్త్రీనగర్‌లో నివాసం ఉంటున్న మురళి (26), విద్యాశ్రీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. మురళి భవన నిర్మాణ కార్మికుడు. కాగా రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబీకులు పలుచోట్ల గాలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైల్వే క్వార్టర్స్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు మంగళవారం సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మురళిగా గుర్తించారు. పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. 


పాఠశాల విద్యార్థినికి తాళికట్టిన సహవిద్యార్థి...

కరూర్‌ జిల్లా కుళిత్తలై సమీపం తోగైమలై ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థిని, తోటి విద్యార్థి ప్రేమించుకుంటున్నారు.విల్లివాక్కం: కరూర్‌ జిల్లా కుళిత్తలై సమీపం తోగైమలై ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థిని, తోటి విద్యార్థి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించి బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో ప్రియుడితో తాళి కట్టించుకున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో ఆమెకు తాళి కట్టిన బాలుడు, అతనికి సహకరించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలను ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద బాలుడిని అరెస్టు చేశారు.

లంచం తీసుకున్న ల్యాండ్‌ సర్వేయర్‌...

ఆర్కేనగర్‌: దిండుక్కల్‌ పశ్చిమ తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా భూ రికార్డుల శాఖ ఆర్కైవ్‌ పనిచేస్తోంది. ఇక్కడ ల్యాండ్‌ సర్వేయర్‌గా భాగ్యరాజ్‌ పని చేసున్నాడు. దిండుక్కల్‌ ఆర్‌ఎమ్‌ కాలనీకి చెందిన గణేష్‌కుమార్‌ ప్రత్యేక పట్టా కావాలని ఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ల్యాండ్‌ సర్వేయర్‌ను సంప్రదించగా భాగ్యరాజన్‌ తన సహాయకుడు సతీష్‌ ద్వారా రూ.30వేలు లంచం అడిగాడు. తర్వాత రూ.15వేలు ఇస్తే చాలని చెప్పాడు. గణేష్ కుమార్‌ అవినీతి నిరోధకశాఖ పోలీసులకు సమాచారం ఇవ్వగా రసాయనం పూసిన నోట్లు ఇచ్చారు. వాటిని గణేష్‌కుమార్‌ మంగళవారం సతీష్‌కు ఇస్తుండగా అనిశా పోలీసులు పట్టుకున్నారు. సతీష్, భాగ్యరాజ్‌ వద్ద విచారణ జరిపి అరెస్ట్‌ చేశారు.

భర్త మృతిని తట్టుకోలేక గర్భిణి ఆత్మహత్య

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కం సమీపం సొర కొళత్తూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ అజిత్‌కుమార్, దివ్యభారతి (23) భార్యాభర్తలు. ప్రస్తుతం దివ్యభారతి 4 నెలల గర్భిణి. వీరికి సర్వేష్‌ (1) అనే కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం అజిత్‌కుమార్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి మనోవేదనతో ఉన్న భార్య దివ్యభారతి మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని