logo

విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం

ఓ వైపు కారులో హోరెత్తుతున్న సంగీతం. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై.

Published : 02 Jul 2024 07:19 IST

మందుబాబు నృత్యం చేస్తుండగా ఈల వేస్తున్న ఏఎస్సై వెంకటేశ్వర్లు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఓ వైపు కారులో హోరెత్తుతున్న సంగీతం. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై. అంతటితో ఆగలేదు. తనలోని కళా పోషకుడిని తట్టి నిద్ర లేపాడు. మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఈలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని