logo

బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య

భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.

Published : 29 Jun 2024 02:26 IST

భర్తే నిందితుడు

భారతి (పాత చిత్రం)

మదనపల్లె నేరవార్తలు, నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కోవూరులోని నాగలకట్ట వీధికి చెందిన రంగయ్య, సాలమ్మల కుమార్తె భారతి (26)కి తొమ్మిదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గణపతితో వివాహమైంది. వీరికి గంగాధర్‌ (6), రోహిత్‌ (4) పిల్లలు. గణపతి, అతని కుటుంబ సభ్యులు భారతిని తరచూ వేధింపులకు గురి చేసే వారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం పెనుమూరు మండలం కార్తికేయపురంలో ఉన్న చిన్నమ్మ జ్యోతి వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన రవితో పరిచయం పెంచుకుని నెలరోజుల క్రితం అతనితో వెళ్లి పోయింది. ఈ నెల 27న గణపతి భార్యకు ఫోన్‌ చేసి బిడ్డలను పోషించలేనని తీసుకెళ్లాలని సూచించాడు. ఆమె గురువారం పలమనేరుకు వచ్చింది. ఇద్దరు కలసి నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లె వద్ద ఉన్న బాహుదా కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అక్కడ గొడవ పడినట్లు తెలుస్తోంది. గణపతి పథకం ప్రకారం తెచ్చుకున్న ఆయుధంతో హత్య చేసినట్లు తెలిసింది. మోటారు వసేందుకు వచ్చిన దివిటివారిపల్లెకు చెందిన మంజునాథ్‌ హత్య చూడటంతో అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్తే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతను కన్పించకుండా పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి తల్లి సాలమ్మ, తమ్ముడు మునికృష్ణ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని