logo

పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..

అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

Published : 02 Jul 2024 07:36 IST

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

బాలాంజలి

యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్‌టుడే: అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పుట్టిన రోజు ఆనందంగా జరుపుకోవాలని తల్లిగారింటికి వచ్చిన వివాహిత అదే రోజు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన సోమవారం జరిగింది.  కుటుంబీకులు, గ్రామస్థుల కథనం మేరకు.. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ బాలాంజలి(25)తో రాజపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన భూపతి సురేష్‌కి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని లాలపేటలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం తన పిల్లలు, భర్తతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో దుస్తులు ఉతుకుతుండగా నీటి మోటార్‌కు ఉన్న విద్యుత్తు తీగ తగిలి షాక్‌కు గురైంది. అపస్మారకస్థితికి చేరిన ఆమెను వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరికి  ఆడ పిల్లలు తన్వి(2), ఆద్య(6 నెలలు) సంతానం ఉన్నారు. బాలాంజలి పుట్టిన రోజు నాడే ఆమెను మృత్యువు వెంటాడటంపై కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని