logo

ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!

జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.

Updated : 29 Jun 2024 05:31 IST

నాంపల్లి, న్యూస్‌టుడే

నాంపల్లి మండల పరిషత్‌ కార్యాలయం

జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. నిర్ధేశిత గడువు లోపు జరగవని, ప్రత్యేకాధికారుల పాలన తప్పనిసరని పలువురు అధికారులు చెబుతున్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 2తో ముగియడంతో దాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జులై 4న జిల్లా, మండల పరిషత్‌ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిని కొనసాగిస్తారా..? లేక ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా..? అనే విషయంపై క్షేత్రస్థాయిలో అన్ని పార్టీల నేతల్లో చర్చ విస్తృతంగా జరుగుతుండగా.. ప్రాదేశికంలోనూ.. ప్రత్యేకాధికారుల పాలన తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

పదేళ్లపాటు రిజర్వేషన్లు..

బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత గ్రామ పంచాయతీ, ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు చేశాక ఎన్నికలకు వెళ్లాలని ఒక వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గత ఎన్నికలు జరిగినప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలని అప్పటి ప్రభుత్వం చట్టం రూపొందించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గ్రామ పంచాయతీ, పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోగా.. జిల్లా, మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా రానున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుపై ఆచితూచి అడుగులు వేస్తోంది.

స్థానికంగా పాగా వేయాలని..

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో జడ్పీ ఛైర్‌ పర్సన్లతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కువగా భారాస నుంచి ఎన్నికై ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన శాసన సభ, లోక్‌సభ ఎన్నికల క్రమంలో కొందరు జడ్పీటీసీˆలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు కొందరు భారాస వీడి కాంగ్రెస్, భాజపాలలో చేరారు. పదవులను కొనసాగిస్తారనే ఆశ కొందరిలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ నేతలు, ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. పరిస్థితులు తమకు అనుగుణంగా మలుచుకొని స్థానిక సంస్థల్లో పాగా వేయాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై అక్టోబరు వరకు వేచిచూసే ధోరణి కనిపిస్తోంది. మరో వైపు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేసి, పార్టీని పటిష్ఠం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్షలు నిర్వహించిన తర్వాతనే స్థానిక ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని