logo

విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!

విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్‌లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated : 01 Jul 2024 06:10 IST

ఫీడర్‌ యాప్‌లో వివరాల నమోదు
మెదక్‌లో 70 శాతం సర్వే పూర్తి

సర్వే వివరాలు నమోదు పరిశీలిస్తున్న ఎస్‌ఈ జానకిరాములు

మెదక్‌ టౌన్, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్‌లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ సదరన్‌ పవర్‌ డ్రిస్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌పీసీఎల్‌) జియోగ్రాఫికల్‌ సమాచార వ్యవస్థను నూతనంగా తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫీడర్‌ యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతో వెంటనే సరిచేయడానికి ఆస్కారం ఉంటుంది.

పక్కాగా సమాచారం...

జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలో ప్రథమంగా ఈ సర్వేను జూన్‌ 24 నుంచి ప్రారంభించారు. టౌన్‌లో మొత్తం 10 ఫీడర్లు ఉండగా వాటి పరిధిలో ఉన్న స్తంభాలు, నియంత్రికలు, తీగల సైజు, స్తంభాల మధ్య దూరం, విద్యుత్తు లైన్లను తాకుతున్న కొమ్మల ప్రదేశాల వివరాలు.. ఇలా ఒక్కో ఫీడర్‌పై ఎన్ని నియంత్రికలు, వాటి సామర్థ్యం, తదితర వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లు, ఇన్సులేటర్లు, నియంత్రికలపై ఓవర్‌లోడ్, కండక్టర్ల వివరాలను జియోగ్రాఫికల్‌ సమాచార వ్యవస్థలో అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సిబ్బంది గమనించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే ఆ ప్రాంతం వివరాలపై సిబ్బందికి సందేశం వస్తుంది. వెంటనే వారు అవసరమైన సామగ్రితో యాప్‌ సూచించిన ప్రాంతానికి చేరుకొని మరమ్మతులు చేపట్టి విద్యుత్తు పునరుద్ధరిస్తారు.

యాప్‌తో సులభంగా గుర్తింపు

సరఫరాలో అంతరాయం ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. తీగలు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. గాలికి చెట్ల కొమ్మలు తగిలినా, పక్షులు వాలినా, పిడుగు పడినా కూడా అంతరాయం కలుగుతుంది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతోనూ ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ సమయంలో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతారు. సమస్య ఎక్కడుందో అధికారులు, సిబ్బంది గుర్తించి మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించేందుకు ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. యాప్‌ ద్వారా జియోగ్రాఫికల్‌ సమాచార వ్యవస్థతో సమస్య ఏర్పడిన చోటును సులభంగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగానే ఫీడర్‌ యాప్‌లో సిబ్బంది క్షేత్రస్థాయి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. 

70 శాతం నమోదు పూర్తి

రాంబాబు, విద్యుత్తు డీటీఈ మెదక్‌

జిల్లాలో మొదటిసారి మెదక్‌లో సర్వేను చేస్తున్నాం. మూడు బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సేకరించిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 70 శాతం సర్వే పూర్తయింది. ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే విద్యుత్తు సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని