logo

కస్తూర్బాలు భళా

అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది.

Published : 27 Jun 2024 01:48 IST

పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయి. అధునాతన తరగతి గదులు, ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటా పది, ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో పేద బాలికలను వీటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే వీటిలోనే ఉత్తమ బోధన అందుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదువుతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంలో కస్తూర్బా పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు ఉండటం గమనార్హం. 

విద్యతో పాటు క్రీడల్లో రాణింపు

జిల్లాలో 20 కస్తూర్బా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 10 చోట్ల జూనియర్‌ కళాశాలలు నిర్వహిస్తున్నారు. కస్తూర్బాల్లో నిర్వహణకు ప్రత్యేకాధికారులు, బోధనకు సీఆర్టీలు(క్లస్టర్‌ రిసోర్స్‌ టీచర్స్‌) తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మెరుగైన విద్యతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఏటా అధికారులు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. సీఆర్టీలు బాలికలకు అర్థమయేలా ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. బాలికలకు గుణాత్మక విద్య అందించడంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తున్నారు. రెగ్యులర్‌ తరగతులతో పాటు ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణకు ప్రత్యేకంగా ఏఎన్‌ఎంలను నియమించారు. చదువుతో పాటు కరాటే, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కస్తూర్బాల విద్యార్థినులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధిస్తూ.. ప్రత్యేకతను చాటుతున్నారు. వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్మీడియట్‌ విద్యార్థినులు ఇంజినీరింగ్, మెడిసిన్‌ సీట్లు సాధించేలా ఈఏపీ సెట్, నీట్‌ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

కస్తూర్బాల్లో చదివే విద్యార్థినుల కోసం కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గత విద్యా సంవత్సరం కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాలు అమలు చేశారు. బాలికలకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఈ ఏడాది బ్రైటర్‌ మైండ్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకోసం 90 మంది ఉపాధ్యాయినులు, కొందరు విద్యార్థినులకు జూన్‌ రెండో వారంలో ఐదు రోజుల పాటు శంషాబాద్‌లోని కన్హ శాంతి వనంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అక్కడ నేర్చుకున్న విద్యార్థినులు తోటి విద్యార్థులకు ప్రతి రోజు అవగాహన కల్పిస్తున్నారు. 

చేరేందుకు ముందుకు వస్తున్నారు

కస్తూర్బాల్లో చదివే విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వీరికి చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ఎక్కువ మంది చేరేందుకు ముందుకు వస్తున్నారు.

- సుప్రియ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని