logo

ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు

అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు

Published : 30 Jun 2024 03:25 IST

వైకాపా కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తున్న సోమిశెట్టి తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని ఏపీ ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా ప్యాలెస్‌ను తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌ తదితరులతో కలిసి శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైకాపా కార్యాలయాల పేరుతో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, స్థలాలను సంబంధిత శాఖల అనుమతి లేకుండా విశాఖ రుషికొండ ప్యాలెస్‌ తరహాలోనే అన్ని ఒకే నమూనాల్లో నిర్మాణాలు చేపట్టారని దుయ్యబట్టారు. అక్రమాలను ప్రజలు తెలుసుకోవడంతోనే 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో వైకాపా వారు నిర్మించిన భవనాలను తక్షణమే స్వాధీనం చేసుకొని వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో 30 ఎకరాల్లో భారీ ప్యాలెస్, హైదరాబాద్‌లో లోటస్‌పాండ్, విశాఖలో రుషికొండ, పులివెందులలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్‌లన్నీ ప్రజల సొమ్ముతో నిర్మించినవేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్పొరేటర్లు పరమేష్, రమణమ్మ, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని