logo

జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా

ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు.

Published : 29 Jun 2024 03:47 IST

కొత్త కలెక్టర్‌ రంజిత్‌ బాషా

బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 10.15 గంటలకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జేసీ నారపురెడ్డి మౌర్య నుంచి బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు జిల్లా తనకు సొంత జిల్లా లాంటిదని, తన స్వస్థలం నందికొట్కూరు నియోజకవర్గం అని, తన విద్యాభ్యాసం కొంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగిందని పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా సుమారు 20 ఏళ్ల కిందట జిల్లాను విడిచి వెళ్లానని.. ప్రస్తుతం తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలుచేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు జేసీ మౌర్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ శర్మ, డీఆర్వో మధుసూదన్‌రావు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని