logo

దర్శన్‌కు మళ్లీ న్యాయనిర్బంధం

తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్‌ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది.

Published : 05 Jul 2024 03:53 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్‌ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. పరప్పన అగ్రహార కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా న్యాయమూర్తి ముందు నిందితులను వర్చ్యువల్‌ విధానంలో హాజరుపరిచారు. తనకు జామీను లభిస్తుందని భావించిన దర్శన్‌ నిరాశకు గురయ్యాడు. 

దర్శన్‌.. నా కుమారుడు

నటుడు దర్శన్‌కు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని మాజీ ఎంపీ సుమలతా అంబరీశ్‌ వ్యాఖ్యానించారు. దర్శన్‌ హత్య చేసి ఉంటాడని భావించడం లేదన్నారు. హైప్రొఫైల్‌ కేసు కావడంతో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని విశ్వసిస్తున్నానని ఆమె తెలిపారు. రేణుకాస్వామి హత్యకు గురికావడం దురదృష్టకరమని, ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. మన న్యాయవ్యవస్థ వారికి సరైన న్యాయాన్ని అందించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. హత్య, అనంతరం దర్శన్‌ అరెస్టుతో తాను మానసిక వ్యధకు గురై, అందరికీ దూరంగా ఉన్నానని చెప్పారు. దర్శన్‌ నటునిగా కాకుండా, తన కుమారునిగా, ఇంటి మనిషిగా ఉన్నాడని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున తాను ఇతర విషయాలను మాట్లాడనని విలేకరులకు తెలిపారు.

నేనే ఆయన భార్యను..

బెంగళూరు (సదాశివనగర): చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో కారాగారం చేరిన నటుడు దర్శన్‌ తనకు మాత్రమే భర్త అని ఆయన భార్య విజయలక్ష్మి నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌కు, హోం మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌కు లేఖ రాశారు. తామిద్దరం 2000 నుంచి ప్రేమించుకుని 2003లో ధర్మస్థలలో వివాహం చేసుకున్నామని, ఒక కుమారుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో కారాగారంలో ఉన్న నటి పవిత్ర గౌడను దర్శన్‌ భార్య అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఒకటి రెండు సందర్భాల్లో హోం మంత్రి కూడా ఆమెను దర్శన్‌ భార్య అని ఉటంకించారని గుర్తు చేశారు. పవిత్రగౌడ, సంజయ్‌ సింగ్‌ భార్యాభర్తలని, వారికి ఒక కుమార్తె ఉందని గుర్తుచేశారు. ఇటీవలే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుందని లేఖలో వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని