logo

అరచేతిలో ఆట.. ఉపాధికి బాట

హైదరాబాద్‌ను గేమింగ్‌పరంగానూ హబ్‌గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్‌ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్‌తో తయారు చేసేవారు.

Updated : 30 Jun 2024 11:41 IST

మొబైల్‌ గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాచుర్యం 
హైదరాబాద్‌ హబ్‌గా మారేందుకు అవకాశాలు
ఇమేజ్‌ టవర్‌లో స్టూడియోలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం

మైదానంలో కాళ్లు ఆడించడం తగ్గించేసి ఇప్పుడంతా ఫోన్లలోనే మెరుపు వేగంతో ఆటలు ఆడేస్తున్నారు. సరదాగా ఆడిన ఆటలు కొందరిని గేమర్గా మారేలా చేస్తున్నాయి. లక్షల మందిని దాటుకుని కొందరు గేమర్లు తమ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అలాంటి జాతీయ స్థాయి బాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ సిరీస్‌ పోటీ జరుగుతోంది.

ఇమేజ్‌ టవర్‌ నమూనా 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గేమింగ్‌పరంగానూ హబ్‌గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్‌ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్‌తో తయారు చేసేవారు. ఇప్పుడు మన నేపథ్యానికి తగ్గ ఆటలు మనవాళ్లతో ఇక్కడే  డిజైన్‌ చేయిస్తున్నాయి. ఇందుకు డెవలపర్లు, స్టూడియోలు కావాలి. అంకుర సంస్థల ఏర్పాటుకు ఇంక్యుబేటర్లు కావాలి. రాయదుర్గంలో భారీ ఎత్తున ఇమేజ్‌ టవర్‌ సిద్ధమవుతోంది. 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలు గేమింగ్, యానిమేషన్‌ కోసం తీర్చిదిద్దుతున్నారు. దీని రాకతో కొత్తగా సుమారు 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ రంగంలో 2025 నాటికి 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

హైటెక్స్‌లో బీజీఐఎస్‌ పోటీల్లో గేమర్లు 

  • భారత్‌లో గేమింగ్‌ మార్కెట్‌ ఏటా 20 శాతం వృద్ధితో 2028 నాటికి 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.
  • 2023 ఆర్థిక సంవత్సరంలో 15.4 బిలియన్ల భారతీయులు గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 
  • మన దేశంలో 568 మిలియన్ల మంది మొబైల్‌ గేమర్లు ఉన్నారు. 
  • మొబైల్‌ గేమ్‌ డౌన్‌లోడ్లలో మనదే అగ్రస్థానం. 
  • చైనా తర్వాత ఎక్కువ మంది మొబైల్‌ గేమర్లు భారత్‌లోనే ఉన్నారు.
  • 2021లో 1.5 లక్షలున్న ఈ స్పోర్ట్స్‌ గేమర్లు 2022 నాటికి 6 లక్షలకు చేరుకున్నారు. 2027 నాటికి 1.5 మిలియన్లకు చేరుకుంటారని అంచనా.

భారత్‌ ఇతివృత్తం నేపథ్యంగా గేమ్స్‌ 

తమ సంస్థ భారత్‌లో 2021లో అడుగు పెట్టింది. 160 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాం. వచ్చే రెండు మూడేళ్లలో మరో 150 కోట్లను ఇండియాలో పెట్టుబడి పెట్టనున్నట్లు గత ఆగస్టులో ప్రకటించాం. ఇటీవల క్రాఫ్టన్‌ ఇండియా గేమింగ్‌ ఇక్యుబేటర్‌ ని ఏర్పాటు చేశాం.   ఇటీవల బుల్లెట్‌ ఎకో ఇండియా, గరుగ సాగా భారత్‌ నేపథ్యం ఉన్న ఇతివృత్తంతో విడుదల చేసిన గేమ్స్‌కు మంచి స్పందన వచ్చింది.

కరణ్‌ పాఠక్, అసోసియేట్‌ డైరెక్టర్, ఈస్పోర్ట్స్, క్రాఫ్టన్‌

తల్లిదండ్రులు ఆందోళన చెందినా... 

నేను కొన్ని గేమ్స్‌ ఆడిన తర్వాత వీటిపై ఆసక్తి ఏర్పడింది. ఆడేటప్పుడు ఉత్సాహం, వ్యూహాలతో పాటు విభిన్న ప్రపంచంలో లీనమయ్యే అనుభూతి కలుగుతుంది. తరువాత గేమింగ్‌ అభిరుచిగా మారింది. ఈ రంగం కెరీర్‌ అంటే మొదట తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పరిశ్రమ పెరుగుతున్న తీరు, ఈ స్పోర్ట్స్, గేమ్‌ డెవలప్‌మెంట్‌ పాత్రల పెరుగుదలతో వస్తున్న అవకాశాలను చూసి ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారు.

ఈవిల్, ఇన్సెన్‌ ఈస్పోర్ట్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని