logo

Hyderabad Metro: మెట్రో ఎక్కండి.. దిగాక టికెట్‌ కొనండి.. ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌కు కసరత్తు

హైదరాబాద్‌ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్‌ విధానం చూడబోతున్నామా? అవుననే అంటోంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ.

Updated : 27 Jun 2024 08:25 IST

దూరాన్ని బట్టి ఛార్జీల వసూలు

హైదరాబాద్‌ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్‌ విధానం చూడబోతున్నామా? అవుననే అంటోంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ. విదేశాల్లో మాదిరి ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌ వ్యవస్థ(ఓటీఎస్‌)ను తీసుకురాబోతోంది. ముందే టికెట్‌ తీసుకోవాల్సిన పనిలేదు.. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రోరైలు సంస్థ ఉంది. అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండనుంది. 

ఈనాడు, హైదరాబాద్‌

ప్రస్తుతం ఇలా..

ప్రజారవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు మొదలు.. టికెట్‌ వెండింగ్‌ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్‌కార్డులు, మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో టికెట్‌ పొందే వీలు.. ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్‌ మెట్రోలో ఇప్పటివరకు చూసినవే.

లోపాలు

ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్‌ లూప్‌ టికెటింగ్‌ విధానంలో ముందే టికెట్‌ తీసుకోవాలి. దిల్‌సుఖ్‌నగర్‌లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్‌ వరకు టికెట్‌ తీసుకుని.. మనసు మార్చుకుని అమీర్‌పేటలో దిగుతామంటే ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్ల వ్యవస్థ అనుమతించదు. స్టేషన్‌ సిబ్బందికి చెబితే.. అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత బయటికి పంపిస్తారు. గమ్యస్థానానికి ముందే దిగుదామన్నా గేటు తెర్చుకోలేదు. స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాల్సిందే. ఓటీఎస్‌తో ఇలాంటి సమస్యలు ఉండదు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు.

కొత్తగా

ఇప్పుడు ప్రజారవాణాలో ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు. దీన్నే ఇక్కడా ప్రవేశపెట్టబోతున్నారు. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు(ఎన్‌సీఎంసీ) ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్రణాళిక. ఇప్పటికే మెట్రోరైలు స్టేషన్లలో ఎన్‌సీఎంసీకి సంబంధించిన టికెట్‌ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌ అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లించవచ్చు. మన దేశంలో 2022లో హరియాణా బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి.. మళ్లీ దిగేటప్పుడు చూపిస్తే జీపీఎస్‌ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ తీసుకుంటుంది

విదేశాల్లో ఎప్పటినుంచో...

ఓపెన్‌ లూప్‌ చెల్లింపుల విధానం ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ 2012లోనే ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజారవాణా వ్యవస్థల్లో అమలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన మనవాళ్లకు ఈ విధానం పరిచయమే. త్వరలో హైదరాబాద్‌లో మన మెట్రోలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ తమ ఆర్థిక నివేదికలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు