Revanth Reddy: చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్‌ కీలక సూచన.. అలాగైతేనే టికెట్‌ రేట్ల పెంపునకు అనుమతి!

తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్ల యజమానులు సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

Updated : 02 Jul 2024 16:12 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమ సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘‘సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ, సామాజిక సమస్యలైన సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది. నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్‌ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ నియంత్రణకు కృషి చేస్తూ ఒక వీడియో చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియో రూపొందించాలి. ఇది కచ్చితమైన షరతు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద వాళ్లు వచ్చి రిక్వెస్ట్‌ చేసినా సరే, ఆ మూవీ తారగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వండి. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం. డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వ నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. ఇదొక్కటే మా కండీషన్‌. సినిమా షూటింగ్‌ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్‌శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’

‘‘60 ఏళ్ల పోరాటం, వందలాది విద్యార్థుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటైంది. సమాజంలో వచ్చిన మార్పు, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల కట్టడికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. సిబ్బందితో పాటు నిధులు కేటాయిస్తున్నాం. సైబర్‌ నేరాలు అతిపెద్ద సమస్యగా మారాయి. వీటి నియంత్రణకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇస్తున్నారు. ఇందుకు వారిని అభినందిస్తున్నాను’’

‘‘గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల నేడు కళాశాలలు, స్కూళ్లలోనూ గంజాయి దొరుకుతోంది. వీటిపై చర్యలు తీసుకునేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం. కేవలం సంపన్నులే కాకుండా మధ్యతరగతి, పేద యువకులు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్ అరికట్టడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి పదోన్నతులు కల్పిస్తాం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తాం. మీడియా కూడా రాజకీయ వ్యవహారాలే కాకుండా డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేయాలని కోరుతున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు