logo

జడ్పీ భూముల్లో.. వైకాపా రాబందులు

ఉమ్మడి గుంటూరులో జిల్లా పరిషత్తు భూములను అయినవారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు నీళ్లొదిలి వాటిని చెరబట్టారు.

Updated : 04 Jul 2024 04:43 IST

తీర్మానాలు లేకుండానే స్వాధీనం
అనుమతుల్లేకుండానే నిర్మాణాలు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, జిల్లా పరిషత్తు (గుంటూరు)

మ్మడి గుంటూరులో జిల్లా పరిషత్తు భూములను అయినవారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు నీళ్లొదిలి వాటిని చెరబట్టారు. సొంత పార్టీకే చెందిన జడ్పీ పాలకవర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఒత్తిడి తెచ్చి మరీ వాటిని దక్కించుకున్నారు. రూ.కోట్ల విలువైన భూములను పేదల పేరుతో దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. అనుమతులు లేకుండానే అధికార దర్పంతో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మింపజేశారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సాగించిన భూ ఆక్రమణలు అన్నీఇన్నీ కావు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా గత ఎన్నికలకు ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఈ క్రమంలో జడ్పీ భూములను కాపాడుకునేందుకు వైకాపా వారితో పోరాడాల్సి వచ్చిందని వాపోయారు. 

పేదల పేరుతో స్వాధీనానికి కుట్ర

నాటి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సత్తెనపల్లిలోని జడ్పీకి చెందిన 2.74 ఎకరాలపై కన్నేశారు. దీని బహిరంగ మార్కెట్‌ విలువ రూ.20కోట్లు. అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలకు నామమాత్రపు ధరకు ఇవ్వాలని ప్రతిపాదించారు. అనంతరం చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నారు. ఇందుకోసం జడ్పీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 2023లో సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జడ్పీ భూములను ఇతరులకు దీర్ఘకాల అవసరాలకు కేటాయించకూడదు. కేవలం మూడేళ్ల లీజుకు ఇవ్వొచ్చు. పైగా శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. అయినప్పటికీ అప్పట్లో అంబటి ఒత్తిడి మేరకు తీర్మానాన్ని పంపినా ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. 

‘ఆళ్ల’ సామ్రాజ్యమని..

  • నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గమంతా తన సామ్రాజ్యం అన్నట్టుగా వ్యవహరించారు. మంగళగిరి జాతీయ రహదారి పక్కన జడ్పీకి చెందిన 60 సెంట్లలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కేంద్రాల నిర్మాణాలు చేయించారు. జిల్లా పరిషత్తు భూముల్లో నిర్మాణాలు చేయాలంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలను ఆమోదించాలి. ఇవేమీ లేకుండానే నిర్మించేయడం నిబంధనలకు విరుద్ధం. భూమి జడ్పీకి చెందిందని బోర్డు పెట్టినా తొలగించేశారు. మంగళగిరి పాతబస్టాండ్‌ కూడలిలో జడ్పీకి చెందిన 25 సెంట్ల స్థలంలో జీ ప్లస్‌ 4 భవనంలో చేనేత దుకాణాల సముదాయం నిర్మించి, 2019 నుంచి 2022 వరకు లీజుకు తీసుకున్నారు. ఏడాదికి రూ.10వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద కాలం ముగిసి ఏడాదిన్నరవుతున్నా అద్దెలు చెల్లించడం లేదు. ఇక్కడ గజం స్థలం విలువ రూ.వేలల్లో పలుకుతోంది. ప్రభుత్వ కార్యాలయాలే అయినా జడ్పీ నుంచి అనుమతులు లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో శాశ్వత నిర్మాణాలు చేయించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. 
  • మేడికొండూరు మండలం పేరేచర్లలోని కైలాసగిరి ఆలయానికి వెళ్లే దారిలో జడ్పీ భూముల్లో తమిళనాడుకు చెందిన 20 కుటుంబాలు పూరిపాకలు వేసుకున్నాయి. వీరంతా క్వారీ కార్మికులు. స్థానిక వైకాపా నాయకులు వారిని వెళ్లగొట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఓ వ్యక్తి శాశ్వత గృహ నిర్మాణాన్ని ప్రారంభించగా స్థానికులు జడ్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ఎంపీడీవోను జడ్పీ సీఈవో ఆదేశించారు. 
  • తాడికొండ నియోజకవర్గంలోని బడేపురంలో జడ్పీ భూమిని వైకాపా నేత ఒకరు లీజుకు తీసుకుని తరువాత తన కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ అధికారి సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఈనాడు’ బయటపెట్టడంతో కలెక్టరు విచారణకు ఆదేశించారు. తెదేపా నాయకులు జడ్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా.. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి ఉండడంతో కంగుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో వైకాపా నేత పేరు తొలగించారు. ఫెన్సింగ్‌ తొలగించేందుకు ప్రయత్నించగా లీజుదారుడు కోర్టుకెళ్లారు. దీంతో కేసు నడుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.కోట్ల విలువైన భూమి వైకాపా నాయకుడి ఆధీనంలో ఉండడం గమనార్హం. తొలుత లీజుకు తీసుకోవడం, క్రమంగా ఆక్రమించుకోవడం నాటి వైకాపా పాలనలో సాగిన అరాచకం. వీరికి ప్రజాప్రతినిధుల అండ ఉండడం, యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం వారికి కలిసొచ్చింది. 

రికార్డుల్లోనే రెండు వేల ఎకరాలు 

మ్మడి గుంటూరు జిల్లాలో జడ్పీకి 2వేల ఎకరాల భూములున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో సింహభాగం రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో రాజధాని ఉన్న మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో విలువైన భూములను వైకాపా నాయకులు కొందరు లీజుల పేరుతో, మరికొందరు అనధికారికంగా సొంతం చేసుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకుని జడ్పీకి ఆదాయ వనరులు పెంచుకోవాలి. 


స్వాధీనం చేసుకుంటాం

- జడ్పీ సీఈవో వసంతరాయుడు

ఆక్రమణల్లో ఉన్న జడ్పీ భూముల వివరాలు సేకరించి స్వాధీనం చేసుకుంటాం. ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని