logo

కళ్ల నిండా కని‘పింఛెను’ సంతోషం

జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి.

Published : 02 Jul 2024 05:52 IST

ఊరూరా పండగలా ఎన్టీఆర్‌ భరోసా లబ్ధి పంపిణీ
వాలంటీర్లు లేకున్నా రాత్రి 10 గంటలకే 95.24 శాతం పూర్తి

జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి. ఎన్టీఆర్‌ భరోసా పింఛను రూ.7 వేల చొప్పున అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు.. ఒంటరి మహిళలు..ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా అందరికీ మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అందించిన కానుకతో పల్లెలు, పట్టణాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ హర్షాన్ని వ్యక్తంచేశారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు.. తెదేపా, జనసేన, భాజపా నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందించే ప్రక్రియ ఆరంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు.. గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పాల్గొని పింఛన్లు అందించారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 

ఊరూరా పండగే.. 

మండపేట, జగ్గంపేట, కొత్తపేట, పి.గన్నవరం, గోపాలపురం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, ప్రత్తిపాడు, అమలాపురం, రాజోలు ఇతర నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తాళ్లరేవులో పలుచోట్ల లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌ రాగంపేటలో రూ.7వేల పింఛను సొమ్ముతోపాటు కిలో చొప్పున మిఠాయి ప్యాకెట్లు అందించారు. 

కె.గంగవరం మండలం దంగేరులో పింఛను అందజేసేందుకు డోలు సన్నాయి మేళాలతో వెళ్తున్న ప్రజాప్రతినిధులు 

రికార్డు స్థాయిలో అందజేత

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో అయిదురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయిస్తే మొదటి రోజు 85 నుంచి 90 శాతంలోపే జరిగేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా ప్రక్రియ చేపట్టింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా ఉమ్మడి జిల్లాలో 95.24 శాతం పంపిణీ పూర్తిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మినహా అందరికీ తొలి రోజే అందించేలా తూర్పు, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ప్రశాంతి, షాన్‌ మోహన్, హిమాన్షుశుక్లా కార్యాచరణ సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సర్వర్‌ మొరాయించడంతో సుమారు గంటపాటు నిలిచింది. తరువాత సజావుగా సాగింది. ః కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 3,897 మంది సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల వారు 350 మందిని నియమించారు. 

తాళ్లరేవు: గాంధీనగర్‌లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న తెదేపా మహిళలు 


జీవనానికి, మందులకు ఉపయోగం

రాజోలు: రాజోలుకు చెందిన గాలి వనువులమ్మకు 80 ఏళ్లు..ఆమె కుమారుడు వీర వెంకటసత్యనారాయణ ప్రత్యేక ప్రతిభావంతుడు.ఏ పనీ చేయలేరు. వృద్ధాప్య పింఛను ఆమెకు ఈ నెల రూ.7 వేలు, సత్యనారాయణకు దివ్యాంగ పింఛను రూ. 6 వేలు  సోమవారం అందజేశారు. చంద్రబాబు పింఛను పెంచడం ఆనందంగా ఉంది’. జీవించడానికి, మందులకు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది’ అని వనువులమ్మ చెప్పారు.

రామచంద్రపురం: కొత్తూరుకు చెందిన దివ్యాంగురాలు ఉమాదేవి తన రూ.6వేలు పింఛనులో రూ.3వేలను రాజధాని అభివృద్ధి కోసం మంత్రి సుభాష్‌కు అందించారు.  

ఇక ఆందోళన తొలగింది

మామిడికుదురు: గ్రామానికి చెందిన 95 ఏళ్ల కానుపూడి పుణ్యవతి పెంచిన సొమ్ముతో కలిపి వృద్ధాప్య పింఛను రూ.7 వేలు తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. వైద్యం, మందులకు ఏవిధమైన ఆందోళన లేదన్నారు. పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు ఒకేసారి పెంచడంతో తనలాంటి వారికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.


తోడుకోడళ్ల మురిపెం..

పి.గన్నవరం: మాకు నెలకు వితంతు పింఛను కింద రూ.మూడు వేలు వచ్చేది. కొత్త ప్రభుత్వం రూ.నాలుగువేలకు పెంచింది. ఏప్రిల్‌ నుంచి పెంపు అమలు చేశారు. మాకు రూ.ఏడువేలు చొప్పున డబ్బులు ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది.  

   - సుంకర సత్యవతి, సూర్యావతి, తోడుకోడళ్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని