logo

భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!

చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్‌ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్‌కు అప్పగించారు.

Updated : 02 Jul 2024 10:37 IST

తితిదే భూములు కార్పొరేషన్‌కు ధారాదత్తం
పరిహారం లేకుండానే అప్పగింత
ఈనాడు-తిరుపతి

తితిదేకు చెందిన విలువైన భూమిని కార్పొరేషన్‌కు ఇచ్చిన సామవాయి మార్గం.

చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్‌ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్‌కు అప్పగించారు.

మున్సిపల్‌ కూరగాయల మార్కెట్‌ నుంచి తిలక్‌రోడ్డు మార్గం విస్తరణ కోసం తితిదేకు చెందిన 15 సెంట్ల భూమితోపాటు తిలక్‌రోడ్డు నుంచి జబ్బార్‌ లేఅవుట్‌ ప్రాంతం వరకు 5 సెంట్లు మొత్తంగా 20 సెంట్ల (968 చదరపు గజాలు) స్థలం ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ రోడ్డు నుంచి సామవాయి రహదారికి అనుసంధానంగా రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక్కడ ఏకంగా 1.12 ఎకరాలు (5420.8 చ.గ) స్థలాన్ని అప్పగించారు. ఇది  శ్రీనివాసం అతిథిగృహానికి సమీపంలో ఉంది. దీన్ని కార్పొరేషన్‌కు కట్టబెట్టారు. ఇక్కడ ప్రభుత్వ భూమి విలువ రూ.15 కోట్లకుపైనే ఉంటుంది.

దాత్త స్వభావంతో శ్రీవారి భక్తుల అవసరాల కోసం తితిదేకు దాతలు ఇచ్చిన భూములు వైకాపా ప్రభుత్వంలో కార్పొరేషన్‌కు అప్పనంగా ధారాదత్తం చేశారు. పరిహారం మాట ఎత్తకుండానే రూ.వందల కోట్ల విలువైన భూములను రహదారుల విస్తరణ పేరుతో దోచిపెట్టారు. వైకాపా హయాంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి అడిగిందే తడవుగా తితిదే ఆస్తులను కార్పొరేషన్‌కు వై.వి.సుబ్బారెడ్డి కట్టబెట్టారు. కేవలం నాడు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే భక్తుల పేరు చెప్పి వాటిని తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో అసలు ఆయా రహదారుల అవసరం లేకున్నా కేవలం మామూళ్ల కోసమే వీటిని చేపట్టారన్న ఆరోపణలున్నాయి.
తిరుపతి పరిధిలో మొత్తం 18 బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) రహదారులను కార్పొరేషన్‌ చేపట్టింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు కట్టబెట్టిన నాటి కార్పొరేషన్‌ అధికారులు తితిదే భూములను మాత్రం నిధులు చెల్లించకుండానే తీసుకున్నారు. ఇందుకోసం అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిలు చక్రం తిప్పారు. కేవలం తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు భూమన.. తితిదేకు లేఖలు రాయడం.. ఇందుకు సుబ్బారెడ్డి సైతం ధర్మకర్తల మండలిలో తీర్మానాలు చేసి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. పరిహారం చెల్లించాలని తితిదే ధర్మకర్తల మండలి సైతం కోరకపోవడం గమనార్హం. 

విశ్వవిద్యాలయంలో 27.92 ఎకరాలు..

ఎస్వీ విశ్వవిద్యాలయం పరిధిలో బృహత్‌ ప్రణాళిక రహదారుల కోసం 27.92 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయం నుంచి మూడు రహదారులను నిర్మించాలని భావించారు. నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులు, పూర్వ వీసీలు, అధ్యాపకులు, విపక్షాల నేతలు, పలు విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి గవర్నర్‌కు సైతం లేఖలు రాయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. లేకుంటే ఇక్కడ విశ్వవిద్యాలయానికి గతంలో తితిదేకు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని రహదారుల నిర్మాణానికి ఇచ్చేందుకు ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. అంటే భూమన అడగడమే ఆలస్యం తితిదే ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి వాటిని కార్పొరేషన్‌కు అప్పగించారు. చివర్లో భూమిపై హక్కులు కేవలం తితిదేకు మాత్రమే ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఒక్కసారి భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవడం సాధ్యమయ్యేది కాదు. రహదారి నిర్మించిన తర్వాత తితిదే మళ్లీ తమ అవసరాల కోసం మళ్లీ భూములను ఎలా తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని