logo

గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు

రాజీవ్‌ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

Published : 01 Jul 2024 05:49 IST

పనస పండ్ల మధ్య సరకు తరలిస్తుండగా పోలీసుల దాడులు 

శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: రాజీవ్‌ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్‌ 28న హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ రామగుండం వైపు.. అవుటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌గేట్‌ సమీపంలో ఓ బొలెరో వాహనం పనస పండ్ల లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఎస్కార్టుగా స్మగ్లర్లు ఓ కారులో ముందు వెళుతున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్‌ ఎస్‌వోటీ పోలీసులు, శామీర్‌పేట పోలీసులు సంయుక్తంగా ఆ రెండు వాహనాలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. పనస పండ్ల మధ్యలో 33 కిలోల గంజాయిని స్వాధీనంచేసుకుని రెండు వాహనాల్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన శివ ఏపీలోని రాజమండ్రిలో నివాసముంటూ వివిధ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఆయన సూచనలతో ఆంధ్రప్రదేశ్‌ ఏలూరుకు చెందిన గేదెల సతీష్‌(34), కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కోరాడ సాయికుమార్‌(26), విశాఖపట్నం జిల్లా కె.కోటపాడుకు చెందిన బండారు శివకుమార్‌(27) ఒడిశాలో 33 కిలోల గంజాయిని 16 బండిళ్లుగా ప్యాకింగ్‌ చేసుకుని పనసపండ్ల లోడ్‌ మధ్య దాచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రెండు వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు చరవాణిలు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, సాయికుమార్‌పై ఏపీలోని పలు ఠాణాల్లో గంజాయి స్మగ్లింగ్‌ కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. 


కారు సిలిండర్‌లో గంజాయి.. నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ (నాగోలు), న్యూస్‌టుడే : కారులో అమర్చిన ఖాళీ గ్యాస్‌ సిలిండర్‌లో గంజాయి తరలిస్తున్న నిందితుడిని ఆదివారం ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ బృందం, నాగోలు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా పైదురుపాడు గ్రామానికి చెందిన బోయినిపల్లి సురేశ్‌ (35) వృత్తిరీత్యా క్యాబ్‌ డ్రైవరు. సులువుగా డబ్బు సంపాదించేందుకు.. గంజాయి సరఫరా చేసే పాత నేరస్థుడి సూచన మేరకు కారు డిక్కీ లో గ్యాస్‌ సిలిండర్‌ను అమర్చాడు. ఆ ట్యాంకులో గంజాయి అమర్చి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. 31.2 కిలోల గంజాయిని సిలిండర్‌లో ఉంచి విజయవాడ నుంచి హైదరాబాద్‌ మీదుగా నిజామాబాద్‌కు తరలిస్తుండగా.. ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఇదే విధంగా గంజాయి తరలిస్తుండగా 2022లోనూ సురేశ్‌పై భద్రాచలం ఠాణాలో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని