logo

AP Election Results: ఏపీ చూపు.. ఉమ్మడి పశ్చిమగోదావరి వైపు.. ఇక్కడ అత్యధిక స్థానాలొచ్చిన పార్టీకే పట్టం

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్దండుల నుంచి..సాధారణ స్థాయి కార్యకర్తల వరకు ఇప్పుడు అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంది. అందులోనూ ఉమ్మడి పశ్చిమ ఫలితాలపై ఆసక్తి ఎక్కువే.

Updated : 04 Jun 2024 07:25 IST

ఈనాడు, ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్దండుల నుంచి..సాధారణ స్థాయి కార్యకర్తల వరకు ఇప్పుడు అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంది. అందులోనూ ఉమ్మడి పశ్చిమ ఫలితాలపై ఆసక్తి ఎక్కువే. ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికార పగ్గాలు దక్కడం ఆనవాయితీగా మారడం ఇందుకు కారణం. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ నున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

దశాబ్దాల ఆనవాయితీ.. ఉమ్మడి పశ్చిమలో 2004 నుంచి ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతోంది. 2004లో 16 స్థానాలకు కాంగ్రెస్‌ 12 చోట్ల విజయం సాధించగా తెదేపా 4 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. 2009లో మొత్తం 15 స్థానాలకు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా 5 చోట్ల తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానంలో ప్రజారాజ్యం గెలుపొందింది. మళ్లీ కాంగ్రెస్‌కే అధికార పగ్గాలు దక్కాయి. 2014 ఎన్నికల్లో 15 స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులు విజయం సాధించగా.. ఆ పార్టీకే అధికారం వరించింది. 2019లో 15 స్థానాలకు 13 వైకాపా..2 చోట్ల తెదేపా విజయం సాధించగా వైకాపా అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆనవాయితీగా మారింది. 

ఉమ్మడి పశ్చిమ ఫలితమే కీలకం.. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఉమ్మడి పశ్చిమ ఎన్నికల ఫలితమే కీలకంగా భావిస్తున్నారు. మంగళవారం వెలువడే ఫలితాల్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని నమ్ముతున్నారు. మా పార్టీకే ఎక్కువ సీట్లు అంటూ రెండు పార్టీల నాయకులు మొదలు కార్యకర్తల వరకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇదే అంశంపై రూ.కోట్లలో పందేలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ జిల్లాలుగా విడిపోయాక జిల్లాకు 7 చొప్పున మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో మరికొద్ది గంటల్లో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని